ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయాణికులను గాల్లోనే వణికించిన విమానం.. ఒకరు మృతి, 30 మందికి తీవ్ర గాయాలు

international |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 10:25 PM

వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలను దారి మళ్లించడం మనం చూస్తూనే ఉంటాం. ఆకాశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతే.. ఆ సమయంలో ప్రయాణిస్తున్న విమానాలను దారి మళ్లించడం లేదా దగ్గర్లో ఉన్న విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత వాటిని తిరిగి పంపిస్తూ ఉంటారు. అయితే ఆకాశంలో మేఘాలు అడ్డువచ్చినపుడు విమానాలు కుదుపులకు లోను కావడం సర్వసాధారణమే. అందుకే విమానాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఏవైనా మేఘాలు వచ్చినపుడు.. అందులో ఉన్న ఎయిర్‌లైన్స్ సిబ్బంది.. ప్రయాణికులు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. విమానం టేకాఫ్, ల్యాండింగ్ అయినపుడు కూడా ప్రయాణికుల సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచిస్తారు. అయితే తాజాగా ఆకాశంలో ఓ విమానం అల్లకల్లోలం కావడంతో ఒకరు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలు అయ్యాయి.


సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 SQ 321 విమానం.. లండన్‌లోని హెత్‌రో ఎయిర్‌పోర్ట్ నుంచి సింగపూర్ ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం బయల్దేరింది. అందులో 211 మంది ప్రయాణికులు, 18 మంది సింగపూర్ ఎయిర్‌లైన్స్ సిబ్బందితో కలిసి మొత్తం 229 మందితో గాల్లోకి ఎగిరింది. ఈ క్రమంలోనే ఆ సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం తీవ్ర కుదుపులకు లోనైంది. ఈ సంఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే చనిపోయినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ వర్గాలు ధ్రువీకరించాయి. ఇక ఇదే ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలిపారు.


అయితే ఇలాంటి సంఘటన చాలా చాలా అరుదు అని సింగపూర్ ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనతో అలర్ట్ అయిన ఆ విమాన పైలట్.. విమానాన్ని దారి మళ్లించాడు. థాయిలాండ్‌ బ్యాంకాక్‌లోని సువర్ణభూమి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో స్థానిక కాలమానం ప్రకారం మంగళవవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ల్యాండ్ చేశారు.


 అయితే ఈ ఘటనను ధ్రువీకరించిన సింగపూర్ ఎయిర్‌లైన్స్.. చనిపోయిన ప్రయాణికుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. ఒకరు చనిపోగా.. 30 మందికి గాయాలు అయినట్లు వెల్లడించింది. ప్రస్తుతం విమాన ప్రమాదంలో గాయపడిన ప్రయాణికులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందికి సాధ్యమైనంత సహాయాన్ని అందించడమే ప్రాధాన్యమని పేర్కొంది. థాయిలాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి అన్ని రకాల మెడికల్ సహాయాన్ని అందిస్తున్నామని.. తమ టీమ్‌ను బ్యాంకాక్‌కు పంపిస్తున్నట్లు తెలిపింది.


సాధారణంగా ప్రయాణికులు విమానంలో సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాతావరణ రాడార్ నుంచి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోతే.. పైలట్ కూడా ఆ విమానంలో ఉన్న ప్రయాణికులను అలర్ట్ చేయలేడు. అలాంటి సమయాల్లో సీట్లలో కూర్చున్న ప్రయాణికులు.. విమానం కుదుపుల కారణంగా కింద పడిపోయి గాయాలపాలవుతారని నిపుణులు వెల్లడించారు. గత ఏడాది మే నెలలో ఢిల్లీ నుంచి సిడ్నీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం కూడా ఇలాగే కుదుపులకు లోనైంది. ఆ ఘటనలో కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. దీంతో ఆ విమానం నడిపిన పైలట్‌లను విధుల నుంచి తప్పించి విచారణ జరుపుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com