ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మళ్లీ మోదీ గెలుస్తారు.. భారత్‌లో PoK విలీనం పక్కా: అమిత్ షా

national |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 10:18 PM

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న అధికార బీజేపీ.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను తిరిగి భారత్‌లోనే విలీనం చేస్తామని కుండబద్ధలు కొట్టి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్.. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి అధికారాన్ని చేపడుతుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో విలీనం చేయడం పక్కా అని తేల్చి చెప్పారు. ఇక గత కొన్ని రోజులుగా బీజేపీ అగ్రనేతలు అంతా ఇదే విషయాన్ని వెల్లడించడం గమనార్హం. ఇటీవలె ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.


కేంద్రంలో ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారాన్ని సాధిస్తుందని కేంద్రమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌ సాధించిన తర్వాత భారత్‌లో పీఓకే విలీనం ఖాయమని మరోసారి పేర్కొన్నారు. హర్యానాలోని కర్నల్‌ నియోజకవర్గంలో సోమవారం నిర్వహించిన భారీ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న అమిత్ షా.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే పీఓకే విలీనంపై మళ్లీ ప్రస్తావించారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 ను కాంగ్రెస్‌ పార్టీ ఇన్ని దశాబ్దాల్లో రద్దు చేయలేకపోయిందని మండిపడ్డారు. అందుకు కారణం బుజ్జగింపు రాజకీయాలేనని విమర్శించారు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడులు, కదలికలు పెరిగినా వాటిని కాంగ్రెస్ అడ్డుకోలేకపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


 కానీ ప్రధానమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే నరేంద్ర మోదీ ఆ ఆర్టికల్‌ 370 ని రద్దు చేశారని గుర్తు చేశారు. దీంతో ప్రస్తుతం కాశ్మీర్‌లో భారత జెండా స్వేచ్ఛగా ఎగురుతోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మళ్లీ వచ్చేది మోదీ సర్కారేనని.. త్వరలోనే పీవోకే భారత్‌లో విలీనం అవుతుందని అమిత్‌ షా తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేయలేక పోయారని మండిపడ్డారు.


ఇక మైనారిటీల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ అయోధ్య బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనలేదని అమిత్ షా ఆరోపించారు. 80 ఏళ్ల వయసులో ఉన్నా మీరు మన దేశం పరిస్థితి గురించి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారని.. మల్లికార్జున ఖర్గేను విమర్శించారు. కానీ హర్యానా యువత కాశ్మీర్‌ కోసం తమ ప్రాణాలు ఇవ్వగలరని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com