ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇకపై ఉబర్ నుంచి బస్సులు.. ఈ నగరంలో తొలిసారి అందుబాటులోకి సేవలు

national |  Suryaa Desk  | Published : Tue, May 21, 2024, 10:14 PM

ప్రముఖ క్యాబ్‌ సర్వీసుల సంస్థ ఉబర్‌ నుంచి త్వరలో మరో సేవలు అందుబాటులోకి రానున్నాయి. బస్సు సేవలను ప్రారంభించేందుకు ఆ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. తొలుత దేశ రాజధాని ఢిల్లీలో ఈ సేవలను ప్రారంభించనుంది. ఢిల్లీ ప్రీమియం బస్‌ స్కీమ్ పేరుతో ఈ బస్సులను నడపనుంది. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ నుంచి ఆ సంస్థ లైసెన్స్‌‌ను అందుకుంది. ఇటువంటి లైసెన్స్‌ జారీ చేసిన తొలి రవాణా శాఖ ఢిల్లీనే కాగా.. దీన్ని అందుకున్న తొలి అగ్రిగేటర్‌గా ఉబర్‌ నిలవడం విశేషం.


ఉబర్ ఇండియా చీఫ్ అమిత్ దేశ్‌పాండే మాట్లాడుతూ.. ఏడాదిగా ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు కోల్‌కతా నగరంలోనూ ప్రయోగాత్మకంగా ఈ బస్సులను నడిపామని చెప్పారు. ఢిల్లీలో తమ బస్సులకు చాలా ఆదరణ, డిమాండ్ ఉందని తెలిపారు. దీంతో అధికారికంగా తమ సేవలను ఢిల్లీలో ప్రారంభించనున్నామని ఆయన పేర్కొన్నారు. కోల్‌కతాలో బస్సు సర్వీసుల కోసం పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వంలో ఏడాది కిందట అవగాహన ఒప్పందం చేసుకున్నామని అమిత్ దేశ్‌పాండే చెప్పారు.


ప్రయాణికులు వారం రోజుల ముందు నుంచే బుక్‌ చేసుకోవచ్చని ఉబర్‌ తెలిపింది. బస్సు వేళలు, లైవ్‌ లొకేషన్‌, అది ప్రయాణించే మార్గం గురించి ఎప్పటికప్పుడు ఉబర్‌ యాప్‌లో తెలుసుకోవచ్చని వివరించింది. ఒక్కో సర్వీసులో 19-50 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుందని చెప్పింది. ఉబర్‌ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్లు వీటిని నడుపుతారని ఉబర్‌ పేర్కొంది. ఢిల్లీ రవాణా శాఖ అధికారులు మాట్లాడుతూ.. ‘ఢిల్లీ ప్రభుత్వం ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందజేయడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల అవకాశాలను వినియోగించుకోడానికి కట్టుబడి ఉంది’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com