ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి పేర్ని నాని ఏపీ కేబినెట్ నిర్ణయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. అమ్మ ఒడి పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఒకటి నుంచి ఇంటర్ వరకూ అమ్మ ఒడి పథకం అమలు చేస్తామన్నారు. చిన్నారులకు తల్లులు లేకుంటే సంరక్షకులకు అందిస్తామన్నారు. అమ్మ ఒడి కోసం తెల్లరేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలన్నారు. జనవరి నుంచి తల్లుల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తామన్నారు. గ్రామీణ నియోజకవర్గాల్లో అగ్రికల్చర్ ల్యాబ్లు ఏర్పాటు, కృష్ణా-గోదావరి కాల్వల క్లీనింగ్ మిషన్ ఏర్పాటు మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. దేవాలయాల్లో ట్రస్ట్ బోర్డుల ఏర్పాటు చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 77 మండలాల్లో పౌష్టికాహారం అందిస్తామన్నారు. వివిధ రంగాల్లోని మొత్తం వంద మంది ప్రతిభావంతులకు వైఎస్ఆర్ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డులు ఇస్తామన్నారు. అవార్డుతో పాటు రూ.10లక్షలు బహుమతిగా అందజేస్తామన్నారు. ఇసుక కొరత నివారణకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. రోబో శాండ్ తయారీ యంత్రాల కొనుగోలుకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకున్న వాళ్లకు రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. 300 అడుగుల వరకూ రూ.1కే రెగ్యులరైజేషన్కు నిర్ణయించామన్నారు. దారిద్య్రరేఖకు ఎగువన ఉన్న వాళ్లకు 300 గజాల వరకూ మార్కెట్ విలువను బట్టి రెగ్యులరైజేషన్ చేస్తామన్నారు. రెగ్యులరైజ్ చేసిన భూములకు ఐదేళ్ల తర్వాతే యాజమాన్య హక్కులు కల్పిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 395 లైన్మన్ పోస్టుల భర్తీకి, హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.