సారథ్యంలో విరాట్ కోహ్లీని,కేన్ విలియమ్సన్ను ఆదర్శంగా తీసుకుంటానని పాక్ టీ20 కెప్టెన్ బాబర్ అజామ్ అన్నాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరిస్ను పాక్ కోల్పోవడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సర్ఫరాజ్ అహ్మద్పై వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ టీ20 జట్టుకు బాబర్ అజాం కెప్టెన్గా నియమిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకుంది. బాబర్ అజాం నాయకత్వంలోని పాకిస్థాన్ జట్టు త్వరలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. నవంబర్ 3న సిడ్నీ వేదికగా తొలి టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో బాబర్ అజాం మాట్లాడుతూ "ప్రతి పర్యటన కఠినమైనదే. అయితే, అదనపు బౌన్స్ కారణంగా ఆస్ట్రేలియా పర్యటన సవాల్ చేస్తుంది. కానీ మేము ఎప్పటిలాగే విజయాల కోసం వెళ్తాం" అని అన్నాడు. "అంతేకాక, ఫలితాలతో సంబంధం లేకుండా నా వ్యక్తిగత ప్రదర్శనపై సంతోషంగా ఉండలేను. జట్టు ప్రదర్శనతో పాటు, నా వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగుండాలని భావిస్తున్నా. ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ను ఆదర్శంగా తీసుకుంటా. వారు బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తూ జట్టును విజయ పథంలో నడిపిస్తున్నారు" అని బాబర్ అజాం తెలిపాడు."వారిలాగే కెప్టెన్గా, బ్యాట్స్మన్లా విజయవంతం అవ్వడానికి కృషి చేస్తా. ఆస్ట్రేలియా పిచ్లపై ఎక్స్ట్రా బౌన్స్ లభిస్తుంది. ఫాస్ట్ బౌలింగ్ మా ప్రధాన బలం. జట్టులో అనుభవజ్ఞులతో పాటు యువ పేసర్లూ ఉన్నారు. యువ ఆటగాళ్లు రాణిస్తే అద్భుత విజయాలు సాధిస్తాం. ఆసీస్ పర్యటనలో ఫకర్ జమాన్తో కలిసి ఓపెనర్గా దిగుతా. ఇమామ్ ఉల్ హక్ బ్యాకప్ ఓపెనర్" అని బాబర్ చెప్పుకొచ్చాడు.