బీజేపీ నాయకులు నూతన అధ్యక్షుని ఎంపికలో కీలకంగా వ్యవహ రించారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణలో తన వారికే పెద్దపీట వేసుకున్న ముఖ్యమంత్రి యడియూరప్పకు భాజపా అధిష్ఠానం షాక్ ఇచ్చింది. పార్టీ కర్ణాటక శాఖకు నూతన అధ్యక్షునిగా నళిన్కుమార్ కటిల్ (53)ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రిగా తాను కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మహదేవపుర నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద లింబావళికి అప్పగించే ప్రయత్నాలను యడియూరప్ప ఇప్పటికే ప్రారంభించారు. తనకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వాలని, అధ్యక్ష బాధ్యతలు వద్దని లింబావళి ఇప్పటికే తేల్చి చెప్పారు. నళిన్కుమార్ను అధ్యక్షునిగా ఎంపిక చేసే దిశలో కేంద్ర నాయకులపై పార్టీ జాతీయ కార్యదర్శి బి.ఎల్.సంతోశ్ చక్రం తిప్పారు. మంత్రివర్గంలో అయిదుగురు నాయకులకు అవకాశం ఇవ్వద్దని సంతోశ్ చేసిన సూచనలను యడియూరప్ప పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అధ్యక్షుని స్థానానికి అభ్యర్థి ఎంపికలో సంతోశ్ కీలక పాత్ర పోషించారు. నళిన్కుమార్ నియామకం వెంటనే అమలులోకి వస్తుందని అమిత్షా తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆర్ఎస్ఎస్లో ప్రచారక్గా 18వ ఏట అడుగు పెట్టిన నళిన్కుమార్ అందులోనే 12 సంవత్సరాలు కొనసాగారు. తండ్రి మృతి తరువాత సివిల్ కాంట్రాక్టరుగా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అదే సమయంలో భాజపాలో చేరారు. దక్షిణ కన్నడ నియోజకవర్గం నుంచి 2009లో లోక్సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014, 2019లోనూ ఆయన అదే నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.