17వ లోక్సభ తొలి సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. తొలి రోజున కొత్త ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండగా.. ఈ రోజు సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంతకీ అదేంటంటే.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో తన చేతిలో ఓటమి పాలైన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభలో లేకపోవడం గమనార్హం. తొలి రోజే రాహుల్ సభకు రాకపోవడంతో వచ్చిన పలు సందేహాలకు రాహుల్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘లోక్సభ సభ్యుడిగా నాలుగోసారి నా ప్రయాణం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై కేరళలోని వయనాడ్ ఎంపీగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాను. రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం, విధేయతతో ఉన్నాను’ అని సమాధానం ఇచ్చారు. ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసి స్మృతి ఇరానీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తదనంతరం జరిగిన మంత్రివర్గ కూర్పులో స్మృతి స్థానం సంపాదించారు. కీలక స్త్రీ శిశు సంక్షేమ శాఖతో పాటు జౌళి శాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా, హౌస్ అంతా ట్రజెరీ బెంచీలనుంచి చప్పట్లతో మారుమోగింది.