న్యూఢిల్లి : ప్రజల కోసం ప్రతిపక్షాలు సహకరించాలని ప్రధాని మోడీ పిలుపు నిచ్చారు. స్వపక్షం, విపక్షం అనే మాటలను పక్కన పెట్టి ప్రజల కోసం కలిసి పని చేద్దామని ఆయన అన్నారు. ప్రతిపక్షం పాత్రను తాము గౌరవిస్తామని ఆయన చెప్పారు. సంఖ్యాబలం లేదని ప్రతిపక్షాలు బాధపడవద్దని ఆయన అన్నారు. 17వ లోక్సభ నేడు ప్రారంభం కాబోతోందని ఆయన అన్నారు. సభలోకి అనేకమంది కొత్తవాళ్లు వస్తున్నారని ఆయన అన్నారు. అనేక అంశాలపై సమావేశాల్లో చర్చ జరగాల్సి ఉందని, ప్రతి అంశంపై చర్చకు సభ్యులు సహకరిస్తారని తాను భావిస్తున్నానని మోడీ చెప్పారు. ప్రజలు మరోసారి సేవ చేసే అవకాశం ఇచ్చారని, గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చామని ఆయన అన్నారు.