చైనాలో ఫుజియాన్ ప్రావిన్స్లో ప్రధాన రహదారిపై భారీ కొండచరియలు కుప్పకూలటంతో భారీ ఎత్తున కార్లు ధ్వంసమయ్యాయి. కుండబోత వర్షం కారణంగా జియాంగ్శెంగ్ రహదారిపై భారీ సంఖ్యలో ట్రాఫిక్ ఝాం కావటంతో అనేక వాహనాలు నిలచి పోయాయి. అయితే రోడ్డు ఎడమవైపు ఉన్న కొండలపై నుంచి చరియలు కార్ల మీద పడుతుండటంతో జనం పరుగులు తీసారు. శరవేగంతో బండరాళ్లు దూసుకొచ్చి.. తమ కార్లను ధ్వంసం చేసాయంటున్నారు యజమానులు. అదృష్టవశాత్తు తామంతా కార్లను దిగి దూరంగా జరటంతో ప్రాణాలు కాపాడుకోగలిగామని, కొందరికి చిన్న చిన్న గాయాలు మినహా ప్రాణనష్టం సంభవించలేదని తెలిపారు. మరోవైపు ఈ విషయమై సమాచారమందుకున్న ఎమర్జెన్సీ సర్వీస్ బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చాయి. కొండ చరియలను తీసి వేస్తూ, ట్రాఫిక్ క్లియర్ చేసాయని బాధితులు మీడియాకు చెప్పారు.