ఏపీ శాసనసభ స్పీకర్, సత్తెనపల్లి తెదేపా అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీస్స్టేషన్లో మంగళవారం కేసు నమోదైంది. ఎన్నికల రోజున సత్తెనపల్లి నియోజకవర్గం ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలో కోడెల శివప్రసాదరావు ఆక్రమణకు పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కోడెలతో పాటు మరో 22 మంది తెదేపా నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయంలో వైసీపీ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారనే సమాచారంతో కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా అక్కడికి వచ్చి కోడెలను చుట్టుముట్టారు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. కోడెలతో పాటు అతని అనుచరులపై వైసీపీకి చెందిన కొంతమంది దాడికి పాల్పడ్డారు. గాయపడిన కోడెలను అతికష్టంపై భద్రతా సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో వైసీపీకి చెందిన 20 మందికి పైగా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా కోడెలపై ఫిర్యాదు చేశారు. ఇనిమెట్ల పోలింగ్ కేంద్రంలోని వైసీపీ ఏజెంట్ కోడెలపై ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదంటూ ఆ పార్టీ నేతలు గుంటూరు గ్రామీణ ఎస్పీ రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ బూత్లో ఎక్కువసేపు ఉంటూ ఓటర్లను కోడెల ప్రభావితం చేశారని వైసీపీ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కోడెలతో పాటు మరో 22 మంది తెదేపా నేతలపైనా కేసులు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు.