ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలకు నీటి గండం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2019, 02:52 PM

 ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు నీటిగండం పొంచిఉంది. తీవ్రమైన ఎండలకు తిరుమల గిరుల్లోని జలాశయాల్లో నీరు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. మరో మూడు, నాలుగు నెలల వినియోగానికి మాత్రమే నీరు సరిపోనుంది. జులైలో వర్షాలు కురవకపోతే భక్తకోటికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. నీటి సమస్య మొదలవుతుండడంతో టీటీడీ నీటి పొదుపుకు చర్యలు చేపట్టింది. వాస్తవానికి తిరుమలలో భక్తుల దాహార్తిని తీర్చడానికి పసుపుదార, కుమారదార, పాపవినాశనం, గోగర్బం, ఆకాశగంగ డ్యాములు ఉన్నాయి.  వీటి నుంచే తిరుమల కొండకు అన్ని అవసరాల కోసం నీటిని వినియోగిస్తుంటారు. అయితే గతేడాది వర్షాకాలంలో శేషాచలం కొండల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.  దీంతో జలాశయాలు పూర్తిస్థాయిలో నిండలేదు.  ఇప్పటికే ఆకాశగంగ, గోగర్భం జలాశయాలు ఎండిపోయినట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. 


తిరుమలలోని కుమారధార, పసుపుధార, పాపవినాశనం జలాశయాల్లో మాత్రమే ప్రస్తుతం నీరు అందుబాటులో ఉంది.  వీటిల్లోని నీరు కూడా  మూడు నాలుగు నెలల వరకే సరిపోయే పరిస్థితి కనిపిస్తోంది.  తిరుమలలోని 5 జలాశయాల్లో ప్రస్తుతం 3,840 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. తిరుమలలో అన్ని అవసరాలకు కలిపి రోజుకు 32 లక్షల గ్యాలన్లకుపైగా నీరు అవసరం ఉంటుంది. అంటే ఉన్న నీరు కరెక్ట్‌గా నాలుగు నెలలకు సరిపోతుంది. 


 నీటి సమస్య వస్తుందని గ్రహించిన టీటీడీ నీటి పొదుపు చర్యలు చేపట్టింది.  స్థానికులు నివసించే బాలాజీనగర్‌కు ఐదు రోజులకొకసారి నీటిని వదులుతున్నారు. మఠాలకు, హోటళ్లకు రోజుకు రెండు పూటలకు కలిపి ఎనిమిది గంటలే నీటి సరఫరా చేస్తున్నారు. అద్దె గృహాల్లో, తిరుమల పరిసరాల్లోని మరుగుదొడ్ల దగ్గర తక్కువ నీటిని సరఫరా వినియోగించే పుష్‌ట్యాపులను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో తెలుగు గంగ నుంచి 10 యంఎల్‌డీ నీటిని తిరుపతికి తరలించి, తిరుపతి, తిరుమల అవసరాలు తీర్చాలని అనుకున్నారు. కానీ తిరుమల గిరుల్లోని డ్యాములు నిండడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. కానీ ఇప్పుడు నీటి సమస్య పొంచి ఉండడంతో మళ్లీ  తెలుగుగంగ నీటిని తిరుమలకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు తిరుమల జలాశయాల్లో నీటిమట్టం పడిపోతుండడంతో వరుణయాగం నిర్వహణకు టీటీడీ సిద్ధమవుతోంది. త్వరలోనే కంచి మఠాధిపతి విజయేంద్ర సరస్వతిని ఇందుకోసం సంప్రదించే యోచనలో టీటీడీ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com