అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ చంద్రబాబు నిరసనకు తెలుపుతున్నారు. పార్టీ నాయకులతో కలిసి చంద్రబాబు సెక్రటేరియట్లోని 5వ బ్లాక్ వద్ద ధర్నాకు కూర్చున్నారు. అంతకు ముందు సీఎం చంద్రబాబు ఎన్నికల అధికారి ద్వివేదీతో సమావేశమయ్యారు. టీడీపీ నేతల ఇళ్లపై ఐటీ దాడులను, పోలీసు ఉన్నతాధికారుల బదిలీల విషయమై చంద్రబాబు ప్రస్తావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే ఎన్నికల సంఘం అదే చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏపీలో ఎన్నికల సంఘం తీరుపై ఆయన రాష్ట్ర సీఈఓ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, తాను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాననీ చెప్పారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే శ్రీకాకుళం కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేశారని.. ఆ అధికారం ఈసీకి ఎక్కడుందని సీఎం ప్రశ్నించారు. వివేకా హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి పెద్ద డ్రామా ఆడారని కేసులో నిజానిజాలు బయటకు రాకుండా కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయించారని చంద్రబాబు మండిపడ్డారు. ఏపీ రాష్ట్రంలో అధికారుల బదిలీల విషయంలో కనీసం అధికారుల వివరణ కూడ తీసుకోలేదని బాబు మండిపడ్డారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల వివరణ ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుల మీద ఈసీ చర్యలు తీసుకొందన్నారు. కానీ, తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను ప్రతి ఒక్క పౌరుడు తీసుకోవాలని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు.