బీజేపీ అసమ్మతి నేత, ఎంపీ శతృష్ను సిన్హాకు అధిష్టానం షాక్ ఇచ్చింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నాసాహిబ్ లోక్ సభ స్థానం నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు అవకాశమిచ్చింది. ఆయన ప్రస్తుతం బీహార్ నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. బీహార్లో లోక్సభ అభ్యర్థుల జాబితాను ఎన్డీయే శనివారం విడుదల చేసింది. కేంద్రమంత్రులు రాధా మోహన్ సింగ్ తూర్పు చంపారన్ నుంచి, గిరిరాజ్ సింగ్ బెగుసరై నుంచి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ శరణ్ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ లో మొత్తం 40 లోక్సభ నియోజక వర్గాలుండగా.. 39 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులను ఖరారు చేశారు. పొత్తులో భాగంగా బీజేపీ, నితీశ్ కుమార్కు చెందిన జేడీయూ చెరో 17 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. మిగతా ఆరు సీట్లను లోక్ జనశక్తి పార్టీకి కేటాయించారు.