విశాఖపట్నం : బంగాళాఖాతం మీదుగా కోస్తా పైకి తూర్పుగాలులు వీస్తున్నాయి. ఇదే సమయంలో మధ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.దీంతో కోస్తాలో అనేకచోట్ల పొగమంచు కురిసింది.
ప్రధానంగా మధ్య కోస్తా జిల్లాల్లో పొగమంచు ఎక్కువగా కనిపించింది.ఉత్తర కోస్తా జిల్లాల్లోని శివారు, ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత నెలకొంది. కోస్తా, రాయలసీమల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగాను, పగటి ఉష్ణోగ్రతలు ఒకటి, రెండు డిగ్రీలు అటుఇటుగా నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా అనంతపురంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో పొడి వాతావరణం నెలకొంటుందని, తర్వాత రెండు రోజులు కోస్తాలో అక్కడక్కడా పిడుగులతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.