కన్నబిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తి ..ఆ తర్వాత తనకు కోర్టులో శిక్ష పడుతుందనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని.. కార్వాన్, కుల్సుంపురా పోలీస్స్టేషన్ పరిధి ఈ ఘటన చోటు చేసుకుంది. కార్వాన్.. జియాగూడలోని భాంజావాడికి చెందిన గణేష్(40)కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అయితే.. 2017లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన 13 సంవత్సరాల పెద్ద కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఈ కేసు నాంపల్లిలోని 16వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈనెల 13న విచారణకు వచ్చింది. విచారణలో గణేష్ తన కూతురుపై అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయమూర్తి ముందు అంగీకరించాడు. అయితే విచారణ అనంతరం కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందో అన్న భయంతో గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో గణేష్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.