ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 08:24 PM

టిప్పర్‌ డ్రైవర్‌ మద్యం మత్తు ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. తన దారిన తాను కారులో వెళుతున్న టీడీపీ నేతను అతివేగంగా వచ్చిన టిప్పర్‌ డివైడర్‌ను దాటి వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న టీడీపీ నాయకుడు, కంచికచర్ల మండలం చెవిటికల్లు మాజీ సర్పంచ్‌ కోగంటి విష్ణువర్ధనరావు అక్కడిక్కడే మరణించారు. కోగంటి విష్ణువర్థనరావు విజయవాడలో ఉంటున్నారు. గతంలో తన ఇంట్లో పనిచేసిన వ్యక్తి మనుమరాలి వివాహానికి ఆదివారం ఉదయం చందర్లపాడు మండలం తోట రావులపాడుకు కారులో వస్తున్నారు.


నందిగామ మండలం ఐతవరం శివారులో నందిగామ నుంచి విజయవాడ వెళుతున్న టిప్పర్‌ డివైడర్‌ను ఢీకొట్టి రోడ్డు అవతలి వైపున ప్రయాణిస్తున్న విష్ణువర్ధ నరావు కారుపై పడింది. కారు నుజ్జు నుజ్జైంది. కారులో ఉన్న విష్ణువర్థనరావును నందిగామ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు టిప్పర్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్‌ మద్యం తాగి ఉన్నట్లు సీఐ ఎన్‌వీఎల్‌ నాయుడు తెలిపారు. మార్చురీ వద్ద భౌతికకాయానికి మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, వసంత నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నివాళులర్పించారు. పోస్టుమార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. భౌతిక కాయాన్ని కంచికచర్ల పరిసర గ్రామాల ప్రజలు సందర్శించి నివాళులర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com