ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 08:31 PM

ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, తమ కుటుంబాలు రోడ్డున పడకుండా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ జీతాలు క్లీయర్ చేసేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని హామీ ఇచ్చారు. ఉద్యోగం తిరిగి ఇప్పించి ఆదుకోవాలంటూ జి.సుజన కుమారి అనే దివ్యాంగురాలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసింది. కడప జిల్లా కమలాపురం ల్యాబ్ లో గత పదేళ్లుగా హెల్పర్ గా పని చేస్తున్న తనను మూడు నెలల క్రితం విధులు నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఒక కిడ్నీ లేదని, బరువులను ఎత్తే పనులు చేయలేనని తెలిపారు. ఏ ఆధారం లేని తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించి ఆదుకోవాలని సుజన కుమారి వేడుకున్నారు. వెంటనే స్పందించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులతో ఈ విషయమై మాట్లాడతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com