ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యాయత్నం జరిగిన చోట మరోసారి ట్రంప్ సభ.. ప్రచారంలో పాల్గొన్న ఎలాన్ మస్క్

international |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 08:00 PM

అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనుండగా.. మరో నెల రోజులే గడువు ఉండటంతో డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధులు కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్‌లు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. తనపై హత్యాయత్నం జరిగిన పెన్సిల్వేనియా ప్రాంతంలోనే మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కడ ప్రచారం నిర్వహించారు. గత జులైలో పెన్సిల్వేనియా ప్రచార సభలోనే డొనాల్డ్‌ ట్రంప్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్ హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌నకు మద్దతు ప్రకటించిన మస్క్.. ఆయనకు ప్రచార సభలో తొలిసారి పాల్గొన్నారు.


బట్లర్‌లో ప్రచారం నిర్వహించిన ట్రంప్.. కాల్పుల ఘటనలో మృతి చెందిన వ్యక్తికి సంతాపం తెలిపారు. ‘మా ఉద్యమాన్ని ఎవరూ ఆపలేరు. మా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు’ అని కాల్పు ఘటనను ఉద్దేశిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘సరిగ్గా 12 వారాల క్రితం ఇదే రోజు సాయంత్రం ఇదే మైదానంలో, ఒక హంతకుడు నన్ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ సభలో పాల్గొన్నవారంతా ట్రంప్‌నకు మద్దతుగా టోపీలు ధరించారు. వేదికపై మస్క్‌ను ఆహ్వానించిన ట్రంప్.. ఆయన అద్బుతమైన వ్యక్తి అని కొనియాడారు.


అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో జులై 11న ప్రచార సభ నిర్వహించారు. ఆ సమయంలో థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ అనే యువకుడు ట్రంప్‌పై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకెళ్లింది. వేగంగా స్పందించిన ట్రంప్ భద్రత విధుల్లో ఉన్న సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది ఆయన్ను కాపాడారు. తనపై కాల్పులు జరిగిన చోటే ప్రచారం నిర్వహిస్తానని ఇటీవలే ట్రంప్‌ సోషల్ మీడియాలో వెల్లడించగా.. ఆయనకు మద్దతుగా తానూ పాల్గొంటానని ఎలాన్‌ మస్క్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.


ట్రంప్‌కు మద్దతుగా ప్రసంగించిన మస్క్.. ఆయనను పొగడ్తల్లో ముంచెత్తారు. ఇదే సమయంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడైన్‌పై విమర్శలు గుప్పించారు. ‘మాకు ఉన్న అధ్యక్షుడు మెట్లు ఎక్కలేరు.. మరొకరు కాల్పులు జరిగినా పిడికిలి బిగించి ముందుకెళ్తున్నారు.. అమెరికాలో ప్రజాస్వామ్యం బతకాలంటే ట్రంప్ గెలవాలి.. మన జీవితకాలంలో ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి.. నిప్పు కింద ధైర్యాన్ని మించిన నిజమైన పరీక్ష లేదు.. మీకు తెలిసిన ప్రతి ఒక్కరినీ, మీకు తెలియని ప్రతి ఒక్కరినీ ఓటు వేయాలని చెప్పండి.. అలా చేయకుంటే ఇదే చివరి ఎన్నికలు. అది నా అంచనా’ అని మస్క్ అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com