ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మందుబాబులకు మత్తు దిగిపోయే వార్త.. పది రోజులు లిక్కర్ షాపులు బంద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 09:45 PM

ఏపీలో మందుబాబులకు షాక్ తగిలింది. చాలాచోట్ల మద్యం దుకాణాలు మూతపడ్డాయి. పది రోజుల పాటు మద్యం షాపులు తెరుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో లిక్కర్ షాపులను ప్రభుత్వమే నిర్వహిస్తూ వచ్చింది. అయితే నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లనున్నాయి. దీంతో ఇన్నిరోజులు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు.. ఆందోళన చేస్తున్నారు. నూతన మద్యం పాలసీ అక్టోబర్ 12 నుంచి అమల్లోకి రానుండగా.. ఇప్పటికే విధులకు హాజరు కావటం మానేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల మద్యం దుకాణాలు మూతపడ్డాయి.


మందుబాబులు అని అంటారే కానీ.. మద్యం విషయంలో వారి జాగ్రత్తలు నెక్ట్స్ లెవల్లో ఉంటాయి. మద్యం దుకాణాలు రేపు బంద్ అని తెలియగానే.. ఇవాళ సాయంత్రమే వైన్ షాపుల ముందు క్యూ కట్టేస్తుంటారు. తమకు అత్యవసరమైన సరుకును.. ఇంటికి పట్టుకెళ్లందే నిద్రపట్టని పరిస్థితి. గాంధీ జయంతి, ఆగస్ట్ 15 వంటి రోజులు వస్తున్నాయంటే.. మందు బాబులు ఈ రూల్ తప్పకుండా ఫాలో అవుతుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని మందుబాబులకు ఈ విషయంలో షాక్ తగిలింది. అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒక్కరోజే మద్యం షాపులు బంద్ అవుతాయని అనుకున్న చాలా మందికి.. ఊహించని షాక్ తగిలింది. ఏకంగా పదిరోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. దీంతో మందుబాబులు ఆందోళనకు గురౌతున్నారు. నూతన మద్యం పాలసీ కారణంగా తక్కువ ధరకే నాణ్యమైన బ్రాండ్లు రుచి చూడొచ్చని అనుకుంటే.. ఇదేంటి ఇలా అయ్యిందంటూ మందుగ్లాసుతో తమ బాధ పంచుకుంటున్నారు.


అయితే అసలు సంగతి ఏంటంటే.. ఏపీ ప్రభుత్వం అక్టోబర్ 12 నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనుంది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించగా.. కొత్త మద్యం పాలసీ ప్రకారం మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించనున్నారు. దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరందరి కాంట్రాక్టు సెప్టెంబర్ 30తోనే ముగిసింది. ఇంకో పది రోజుల్లో నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. దీంతో పదిరోజుల తర్వాత తమకు ఉద్యోగాలు ఉండవని ఆందోళన చేస్తున్నారు. మద్యం దుకాణాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే తమ గతేంకానంటూ నిరసనలకు దిగుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని.. తమకు ఓ దారి చూపాలని డిమాండ్ చేస్తున్నారు.


మరోవైపు ఈ పదిరోజులూ మద్యం దుకాణాలు తెరవాలని ప్రభుత్వం కోరినప్పటికీ.. ఇప్పటి నుంచే కాంట్రాక్టు ఉద్యోగులు దుకాణాలకు రావటం మానేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. ఇక రేపు అక్టోబర్ రెండో తేదీ గాంధీ జయంతి కావటంతో పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఆ తర్వాత కూడా కాంట్రాక్టు సిబ్బంది కారణంగా.. మరో పదిరోజులు లిక్కర్ షాపులు బంద్ అయ్యే పరిస్థితి ఉంది. దీంతో మందుబాబులు తెగ ఫీలవుతున్నారు. పది రోజుల పాటు లిక్కర్ షాపులు మూతపడితే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. ముందుగానే ఈ విషయం తెలిసి ఉంటే కాస్త మందుజాగ్రత్త చర్యలు తీసుకునేవాళ్లమని అంటున్నారు. అయితే ఆలోపే ప్రభుత్వం, కాంట్రాక్టు ఉద్యోగుల మధ్య ఏదైనా సయోధ్య కుదిరితే మద్యం షాపులు తెరుచుకునే అవకాశం ఉంది. లేకపోతే మందుబాబులంతా బార్లవైపు వెళ్లాల్సిందే.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com