కొల్లేరు సర్కార్ కాల్వ వంతెనపై నుంచి దూకిన విద్యార్థి కోసం పోలీసులు ఆదివారం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరులోని కొత్తూరు ఇందిరా కాలనీలో నివాసం ఉంటున్న పేదాడ రామకృష్ణారావు ఎనిమిదో తరగతి చదువుతున్న తన కుమార్తె వనిత పుట్టిన రోజు సందర్భంగా కొల్లేటికోట పెద్దింటమ్మ ఆలయంలో పూజలు చేసి బంధువులకు విందు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యుల మధ్యన రామకృష్ణారావు ఏలూరులో పదో తరగతి చదువుతున్న తన కుమారుడైన పోలినాయుడు (16)ను పబ్లిక్ పరీక్షల్లో 500 మార్కులు సాధించాలని మాటల మధ్యలో సూచించాడు. దీంతో విద్యార్థి కొద్దిసేపు మౌనంగా ఉండిపోయి మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కుటుంబీకులకు చెప్పి వెళ్ళిపోయి పందిరిపల్లిగూడెంలోని సర్కార్ కాల్వ వంతెనపై చెప్పులు విడిచి దూకేశాడు. దీంతో వంతెనపై నుంచి ప్రయాణికులు బిగ్గరగా కేకలు వేశారు. అనంతరం గ్రామస్థులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన పడవలపై వెళ్ళి గాలించినా విద్యార్థి ఆచూకీ దొరకలేదు.
స్థానికుల సమాచారంతో విద్యార్థి తల్లిదండ్రులకు విషయం తెలిసి వంతెన వద్దకు వెళ్లి చెప్పులను చూసి దూకింది తమ కూమారుడిగానే గుర్తించి బావురుమన్నారు. విషయం తెలుసుకున్న కొల్లేరు వడ్డి సాధికార సమితి కన్వీనర్ బలే ఏసురాజు అధికారులను అప్రమత్తం చేశారు. కైకలూరు రూరల్ ఎస్సై రాంబాబు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడి తల్లిదండ్రుల వద్ద వివరాలు సేకరించారు. అనంతరం పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు గజ ఈతగాళ్ళ సాయంతో బోట్లపై వెళ్ళి ఆదివారం అర్ధరాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినా విద్యార్థి ఆచూకీ లభించలేదు. ఒకవైపు గాలిస్తునే మరో వైపు జంగంపాడు –పల్లిపాడు ఉప్పుటేరుకు అడ్డుగా మత్స్యకా రులతో వలలు కట్టించారు. కొల్లేరు వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. విద్యార్థి తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.