తిరుమల లడ్డూ వివాదం మరో కీలక మలుపు తిరిగింది. శ్రీవారి ప్రసాదం కల్తీ వివాదంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ నెయ్యి సరఫరా చేశారని టీటీడీ ఇచ్చిన ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డెయిరీపై కేసు నమోదు అయ్యింది. దీంతో తన అరెస్టుతోపాటు ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. నెయ్యి శాంపిల్స్ సేకరణ, దాన్ని విశ్లేషించడంలో అధికారులు ఫుడ్ సెఫ్టీ అండ్ స్టాండెడ్స్ అథారిటీ చట్ట నిబంధనలు అనుసరించలేదని ఎండీ రాజశేఖరన్ పిటిషన్లో పేర్కొన్నారు.
నేతి కల్తీ ఆరోపణలపై తన నుంచి ఎలాంటి వివరణ తీసుకోకుండానే కేసు పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని ఆయన కోర్టుకు తెలిపారు. తనపై చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలూ లేవని, రాజకీయ కారణాలతోనే కేసు పెట్టారని ఏఆర్ డెయిరీ ఎండీ ఆరోపించారు. తనను పోలీసులు అరెస్టు చేస్తే పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముందస్తు బెయిల్ మంజూరుకు ఎలాంటి షరత్తులు విధించినా కట్టుబడి ఉంటానని ఆయన పేర్కొన్నారు. రాజశేఖరన్ వేసిన పిటిషన్ హైకోర్టులో రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.