ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుంటూరులో ప్రమాదకరమైన బ్యాక్టీరియా,,,సీన్ కట్ చేస్తే సర్జరీ తర్వాత చనిపోయాడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 08:18 PM

ఏపీలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలతో పలు ప్రాంతాలు మునిగిపోయాయి. విజయవాడతో పాటుగా గుంటూరులోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చి చేరింది. అయితే జగ్గయ్యపేటలో ప్రమాదకర బ్యాక్టీరియా కారణంగా ఓ బాలుడు కాలును కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా గుంటూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ 81 ఏళ్ల వృద్ధుడు ఏకంగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.


గుంటూరు నెహ్రూనగర్ ఆరో వీధిలో నివాసం ఉంటున్న నారాయణకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులున్నారు.. ముగ్గురికి వివాహాలు అయ్యాయి. నారాయణ సోడా బండి నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు.. కొద్దిరోజులుగా ఆ వ్యాపారం కూడా చేయడం లేదు. కొడుకులు, కూతురు అప్పుడప్పుడు వచ్చి తండ్రిని బాగోగులు అడిగి వెళ్లేవారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆయన నివాసం ఉండే ప్రాంతంలో వరద నీరు వచ్చి చేరింది.. అలాగే మురుగు కాలువల నీరు కూడా వచ్చింది. ఆయన ఇంట్లోకి ఆ నీళ్లు వచ్చి చేరగా.. నారాయణ ఇంట్లోనే ఎత్తైన మంచం వేసుకుని, ఓ బల్లపై అవసరమైన వస్తువుల్నిఉంచుకుని అక్కడే కాలం గడిపాడు.


పది రోజుల క్రితం ఆయన కాలు దురదగా అనిపించడంతో.. స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ దగ్గరకు వెళ్లారు. ఆయన ఇచ్చిన మందులు వాడుతున్న సమయంలో.. సెప్టెంబర్ 20న నారాయణ కాలుపై ఓ పుండు ఏర్పడింది. వెంటనే కొడుకులు నారాయణను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లకు చూయించారు. నారాయణ కాలును పరిశీలించిన డాక్టర్లు..అన్ని రకాల పరీక్షలు చేసి ఇన్‌ఫెక్షన్ వచ్చిందని కాలు తీసేయాలని చెప్పారు. దీంతో నారాయణను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు.


ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు మొదట కాలులో కొంత కండ తొలగించారు.. ఆ తర్వాత అబ్జర్వేషన్‌లో పెడదమని చెప్పాు. ఒకవేళ అప్పటికి నయం కాకపోతే కాలు తీసేయాలన్నారు. నారాయణ కొడుకులు అంగీకారంతో ప్రైవేట్ ఆస్పత్రి డాక్టర్లు కండను తొలగించి ఆపరేషన్ చేశారు. కానీ నారాయణ కోలుకోలేకపోయారు.. ఆపరేషన్ చేసిన కొద్దీ రోజులకే ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. వరద నీరు, మురుగు కాలువలలోని నీళ్లు కలవడంతో ఇన్ఫెక్షన్ వచ్చిందని.. అందుకే తమ తండ్రి చనిపోయాడని కుటుంబ సభ్యులు చెప్పారు.


జగ్గయ్యపేటలో కూడా ఓ బాలుడికి బ్యాక్టీరియా దెబ్బకు కాలు తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరులో ఇదే తరహా ఘటన జరిగింది.. మురుగు, వరద కలిసి నీటిలో ఎక్కువ సేపు ఉండటంతోనే ఇటువంటి ఇన్షెక్షన్లు సోకుతున్నాయని డాక్టర్లు అనుమానిస్తున్నారు. వర్షం, వరదల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com