ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మా నాన్న లారీ డ్రైవర్.. మా పార్టీలో అర్హులు ఉన్నా నాకు ఈ పదవి వచ్చింది: ఏపీ మంత్రి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 08:16 PM

జీవితంలో నిబద్ధతో పనిచేస్తే ఉన్నతస్థాయిలో ఉంటామన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్. తాను 30 ఏళ్ల క్రితం బీజేపీ అనుబంధ సంస్థ ఏబీవీపీలో చేరానని.. అలా పార్టీలో ఎదిగి ఇప్పుడు మంత్రి అయ్యానన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. తాను పుట్టిన ఊరుకు మంత్రి హోదాలో రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. అధిష్టానం అప్పగించిన ప్రతి పనిని చిత్తశుద్ధితో నిబద్ధతతో చేశానని.. అందుకే తనకు ఇంత హోదా లభించింది అన్నారు.


పార్టీ కోసం పనిచేసేవారికి ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అలా పని చేశాను కాబట్టే పార్టీలో ఎంతోమంది అర్హులు ఉన్నా సరే.. తాను అనుకోని మంత్రి పదవి వచ్చిందన్నారు. ఒక లారీ డ్రైవర్ కొడుకుగా ఉన్న తాను ఈరోజు మంత్రిని అవుతారని ఏరోజు అనుకోలేదని ఎమోషనల్ అయ్యారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి టీ అమ్ముకునే వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారన్నారు మంత్రి సత్యకుమార్. ఒక టీచర్ కొడుకు వాజ్‌పేయి కూడా ప్రధాని అయ్యారని.. ఇలా బీజేపీలో ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి ఉన్నతస్థాయికి ఎదిగారన్నారు.


గత ఐదేళ్ల జగన్ పాలనకు రాష్ట్రంలో రోడ్లే ఉదాహరణ అన్నారు మంత్రి. గత ఐదేళ్లుగా అన్ని వర్గాల ప్రజల్ని, ముఖ్యంగా నిరుద్యోగుల్ని జగన్‌ మోసం చేశారని.. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 16,500 డీఎస్సీ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని.. కూటమి అధికారంలోకి రాగానే అమరావతికి కేంద్రం రూ.వేల కోట్లు నిధులు ఇచ్చిందన్నారు. జగన్‌ సొంత జిల్లాలోని ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక వేయలేదని.. సొంత జిల్లాకు ఏమీ చేయలేకపోయారన్నారు.


తాను ధర్మవరం నుంచి పులివెందుల మీదుగా ప్రొద్దుటూరు వచ్చానని.. ఎక్కడ చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. మరీ ముఖ్యంగా పులివెందుల నుంచి ముద్దనూరు వరకూ గతుకుల రోడ్లు ఉన్నాయన్నారు. గండికోట నుంచి కనీసం పిల్లకాల్వలు తవ్వే ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో స్వలాభం, ఇసుక వ్యాపారం కోసం అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు కనీసం మరమ్మతులు చేయలేకపోయారని.. అందుకే ఆ ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ఇప్పటికీ ఆ బాధిత కుటుంబాలకు పరిహారం, నిరాశ్రయులకు ఇళ్ల ఇవ్వలేదన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com