ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ నుంచి 'లులు'ను మేమే పంపించాం.. కారణాలివే: మాజీ మంత్రి గుడివాడ అమర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 08:11 PM

ఆంధ్రప్రదేశ్‌లో లులు గ్రూప్ పెట్టుబడుల కోసం ముందుకొచ్చింది. వాస్తవానికి 2014-2019లో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆ గ్రూప్‌తో ఒప్పందం చేసుకోగా.. విశాఖపట్నంలో భూమిని కూడా కేటాయించారు. అయితే 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోయింది (పెట్టుబడులు వెనక్కు తీసుకుంది). లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కారణమని విమర్శలు వచ్చాయి.


అయితే తాజాగా లులు గ్రూప్ ఇంటర్నేషనల్‌ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ చంద్రబాబును కలిశారు.. ఆ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ క్రమంలో లుల గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోవడానికి కారణాలను.. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమలశాఖ మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్‌నాథ్ చెప్పుకొచ్చారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2019 ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఎవరైనా సరే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై ఒకసారి సమీక్ష చేయడం సర్వసాధారణం అన్నారు మాజీ మంత్రి అమర్. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం లులుకు కేటాయించిన భూమి తాము ప్రతిపక్షంలో ఫైట్ చేశామన్నారు. అందుకే లులుకు కేటాయించిన భూమిపై తమ ప్రభుత్వం ఆరా తీసిందన్నారు.


విశాఖలో లులుకు కేటాయించిన భూమి.. ప్రభుత్వం దగ్గర ఉన్న భూముల్లోనే ఖరీదైనదని చెప్పుకొచ్చారు అమర్. ఆర్కే బీచ్‌కు ఎదురుగా 13.5 ఎకరాల స్థలం లులుకి కేటాయించారని.. అక్కడ ఎకరం భూమి ధర రూ.100 కోట్లు ఉంటుందన్నారు. ఆ భూమి విలువ తక్కువలో తక్కువ రూ.వెయ్యి కోట్లు ఉంటుందని.. కానీ లులు గ్రూప్ మాత్రం రూ.600 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పిందన్నారు. ఏదైనా ఒక సంస్థ, గ్రూప్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి కావాలని.. కానీ గతంలోనే అభివృద్ధి జరిగిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తే ఉపయోగం ఏముంటుందన్నారు.


ప్రస్తుతం విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు అభివృద్ధి జరుగుతోందని.. భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఏర్పాటవుతోందని గుర్తు చేశారు మాజీ మంత్రి. ఎండాడ మధురవాడ వరకు ఇప్పటికే అభివృద్ధి జరిగిందని.. ఆనందపురం, భీమిలి , భోగాపురం వరకు హైవే పక్కనే వందల ఎకరాలు ఉన్నాయి.. 15, 20 ఎకరాలు ఇస్తే సరిపోయేదన్నారు. అక్కడ లులు కన్వెన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటల్, మాల్ ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి అవుతుందన్నారు. అలాంటి చోట్ల లులుకు ఉచితంగా భూమి ఇచ్చినా తప్పులేదన్నారు.


లులు గ్రూపునకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమి ఇచ్చి.. పెట్టుబడి రూ.600 కోట్లు పెడతామంటే ఎలా అని ప్రశ్నించారు అమర్. తమ ప్రభుత్వంలో ఆ గ్రూప్‌తో మాట్లాడిందని.. ఇదే విషయాన్ని వారితో చెప్పామని.. అవసరమైతే మరోచోట భూమి కేటాయిస్తామని చెప్పినా వినలేదన్నారు. కానీ లులు గ్రూప్ మాత్రం తమకు అక్కడే భూమి కావాలని కోరారని.. అందుకే తాము వెళ్లిపోతామన్నారు.. తాము కూడా వెళ్లిపొమ్మని చెప్పామన్నారు. లులు గ్రూప్ రాష్ట్రం వదిలి పారిపోలేదని.. తామే రాష్ట్రం నుంచి పంపించేశామన్నారు. ఎవరు పెట్టుబడి పెడతామని చెప్పినా ఏపీఐఐసీ ద్వారా భూమిని కేటాయిస్తామని.. కచ్చితంగా కొన్ని నిబంధనలు ఉంటాయి.. వాటిని పాటించాల్సిందేనన్నారు.


మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్‌ ఛైర్మన్‌ యూసఫ్‌ అలీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ఇద్దరు చర్చించారు.. ప్రధానంగా విశాఖలో మాల్‌, మల్టీప్లెక్స్‌, హైపర్‌ మార్కెట్‌ ఏర్పాటుతో పాటుగా.. విజయవాడ, తిరుపతిలో మల్టీప్లెక్స్‌ల నిర్మాణంపై చర్చించారు. లులు ప్రతినిధులకు పూర్తి స్థాయిలో మద్దతిస్తామని.. ఏపీ అభివృద్ధిలో పాల్గొనే భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నామని వ్యాఖ్యానించారు చంద్రబాబు.


లులును ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించినందుకు ఆ సంస్థ ఛైర్మన్‌ యూసుఫ్‌ అలీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుతో 18 ఏళ్ల అనుబంధం ఉందని.. ఆయనతో చర్చలు ఫలప్రదమయ్యాయయన్నారు. విశాఖలో అంతర్జాతీయస్థాయి షాపింగ్‌ మాల్‌ నిర్మిస్తామని.. విజయవాడ, తిరుపతిలో హైపర్‌మార్ట్‌లు నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. ఆధునిక ఫుడ్‌ ప్రాసెసింగ్, లాజిస్టిక్‌ సెంటర్లు ప్రారంభించాలని నిర్ణయించినట్లు అలీ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com