ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ మంత్రి కార్యాలయం ముందు టీడీపీ కార్యకర్తల ధర్నా.. ఆ అధికారి నియామకంపై సీరియస్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 30, 2024, 08:13 PM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఓ అధికారి నియామకం కూటమిలో వివాదం రేపింది. టీడీపీ కార్యకర్తలు ఏకంగా మంత్రి కార్యాలయం దగ్గర ధర్నాకు దిగడం చర్చనీయాంశమైంది.. ఆ తర్వాత పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి సత్యకుమార్ ధర్మవరంలోని కార్యాలయంలో పురపాలక అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. కమిషనర్ మల్లికార్జున కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ విషయం తెలియడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి వెళ్లి నిరసన చేశారు.


గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో.. అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డికి అనుకూలంగా పనిచేసిన పురపాలక కమిషనర్‌ మల్లికార్జునను మళ్లీ ధర్మవరానికి ఎలా తీసుకువస్తారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించారు. ధర్మవరంలో మంత్రి సత్యకుమార్‌ కార్యాలయం ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. వెంటనే కమిషనర్‌ను బయటకు పంపాలంటూ ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. టీడీపీ కార్యకర్తలు కార్యాలయం వైపు దూసుకెళ్లగా పోలీసులు సర్దిచెప్పి అడ్డుకున్నారు. ఆ తర్వాత కమిషనర్‌ మల్లికార్జునను మంత్రి కార్యాలయం నుంచి పోలీసు వాహనంలో తరలించారు. కొద్దిసేపటికి మంత్రి సత్యకుమార్ బయటకు రాగా.. టీడీపీ కార్యకర్తలు చుట్టుముట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ కార్యకర్తల్ని పక్కకు పంపగా.. మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు.


టీడీపా కార్యకర్తలు ధర్నా వ్యవహారం ధర్మవరంలో హాట్‌టాపిక్ అయ్యింది. కూటమిలో విభేదాలు మొదలయ్యాయని చర్చ జరిగింది.. దీంతో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, జనసేన పరా్టీ నేత చిలకం మధుసూదన్ రెడ్డి, బీజేపీ నేత సందిరెడ్డి శ్రీనివాసులు ఈ అంశంపై స్పందించారు. ధర్మవరం కూటమిలో ఎలాంటి విభేదాలులేవని, మూడు పార్టీల లక్ష్యం నియోజకవర్గ అభివృద్ది మాత్రమే అన్నారు నేతలు. కూటమిలో మూడు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. కమిషనర్‌ నియామకంపై తమకు అభ్యంతరాలు మాత్రం ఉన్నాయని చెప్పారు. గతంలో ఆయన ధర్మవరంలో కమిషనర్‌గా పనిచేసిన సమయంలో.. వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా పనిచేశారన్నారు.


కమిషనర్ కొందరు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టారని.. ఇదే అంశాన్ని మంత్రి సత్యకుమార్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు ఇవన్నీ తెలియవని.. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ముందు తాము ఎలా కలిసి ఉన్నామో.. ఇప్పుడు అలాగే కలిసి ఉన్నామని తేల్చి చెప్పారు. తొలి ఆరునెలల కాలంలో చిన్నచిన్న సంఘటనలు ఉంటాయని.. అధికారులు, నాయకులంతా సమన్వయం చేసుకోవడానికి సమయం పడుతుంది అన్నారు.


ధర్మవరం నియోజకవర్గంలో గతంలో జరిగిన భూకబ్జాలు, అక్రమాలు గురించి మంత్రి సత్యకుమార్‌కు చెప్పామన్నారు కూటమి నేతలు. కచ్చితంగా వాటిన్నింటిపై చర్యలు ఉంటాయన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ నియామకం ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదని.. దీనిని అడ్డుపెట్టుకుని తమ మధ్య విభేదాలు ఉన్నట్లుగా కొంతమంది చిత్రీకరిస్తున్నారన్నారు. కమిషనర్‌ గతంలో తమ వాళ్లను ఇబ్బంది పెట్టారని.. కార్యకర్తలు, నాయకులకు ఆయన రావడం ఇష్టం లేదన్నారు. కమిషనర్ అంశంలో కచ్చితంగా పునరాలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com