ఆంధ్రా ఊటీగా పిలుచే అరకు లోయ అందాలను చూసేందుకు నిత్యం పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక వానకాలం సీజన్లో అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం రెయినీ సీజన్ ముగుస్తోంది. చలికాలం మొదలుకానుంది. ఈ చలికాలంలో.. అరకులోయ సరికొత్త అందాలను సంతరించుకుంది. మంచు దుప్పటి కప్పుకుని.. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. దీంతో ఈ సీజన్లో ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు అరకు వ్యాలీ చూడ్డానికి వస్తుంటారు. అయితే అలాంటి వారికి రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. సందర్శకుల కోసం విశాఖపట్నం నుంచి అరకు వెళ్లడానికి ప్రత్యేక రైలు నడపనున్నట్లు ప్రకటించింది. దసరా సెలవుల రావటంతో ఈ సమయంలో అరకుకు భారీగా పర్యాటకులు వస్తుంటారు. అలాంటి వారి కోసం అరకుకు ప్రత్యేక రైలు సర్వీసు ఏర్పాటు చేసింది.
విశాఖపట్నం- అరకు ప్రత్యేక రైలు సర్వీసు.. అక్టోబర్ ఐదో తేదీ నుంచి మొదలుకానుంది. ఐదు నుంచి 15వ తేదీ వరకూ ఈ ప్రత్యేక రైలు సర్వీసు నడవనుంది. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరనున్న ప్రత్యేక రైలు.. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు అరకు చేరుకుంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు అరకు నుంచి తిరిగి బయల్దేరి.. సాయంత్రం ఆరుగంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని రైల్వేశాఖ అధికారులు వెల్లడించారు. అరకు వెళ్లే పర్యాటకులు ఈ విషయాన్ని గమనించుకోవాలని ఓ ప్రకటనలో సూచించారు.
మరోవైపు అరకు వచ్చే సందర్శకులను ఆకట్టుకునేందుకు పర్యాటకశాఖ అధికారులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అరకులో పారా గ్లైడింగ్ ఏర్పాటుచేసేందుకు పాడేరు ఐటీడీఏ అధికారులు చర్యలు ప్రారంభించారు. అరకులోయ సమీపంలో పారా గ్లైడింగ్ చేసేందుకు వీలుగా పాడేరు ఐటీడీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఇటీవల పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ పారా గ్లైడింగ్ చేసి.. పరీక్షించారు. కొండల నడుమ సరికొత్త అనుభూతికి లోనయ్యారు. ఇలాంటి ఫీలింగ్ సందర్శకులకు సైతం కలిగించేలా పారా గ్లైడింగ్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తానికి అన్నీ వర్క్ అవుట్ అయితే.. అరకులో అతిత్వరలోనే ఎంచక్కా పారా గ్లైడింగ్ చేసేయొచ్చు.