దేశాన్ని, మతాన్ని కించపరిచేలా మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బాధాకరమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో 100రోజుల పాలన- అభివృద్ధి సంక్షేమాలు పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ఎమ్మెల్సీ అశోక్ బాబుతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను మంత్రి అనగాని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ... భక్తుల మనోభావాలు గౌరవించి జగన్ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు.
తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్ది కృరత్వమని విమర్శించారు. జగన్ది మానవత్వం కాదు.. కృరత్వమని ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే రెవెన్యూ సదస్సులు ప్రారంభిస్తామని తెలిపారు. రీసర్వే సమస్యల పరిష్కారంపై మళ్లీ దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రెవెన్యూ సిబ్బంది వరద నష్టoలో నిమగ్నమైనందున రీసర్వే సమస్యల పరిష్కారానికి కొంత గ్యాప్ వచ్చిందని అన్నారు. కూటమి ప్రభుత్వం 100రోజుల పాలనపై సర్వత్రా చర్చ జరుగుతోందని తెలిపారు. కేవలం 100రోజుల్లో ప్రజలకు మెరుగైన సంక్షేమం ఇచ్చిన ప్రభుత్వం తమది అని ప్రజలు గుర్తించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.