ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు మిథున్ చక్రవర్తికి ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ పురస్కారం వరించడం పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. మిథున్ చక్రవర్తికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. హిందీ, బెంగాలీ చిత్ర పరిశ్రమలో మిథున్ చక్రవర్తి తనదైన ముద్ర వేశారన్నారు. 80వ దశకంలో దేశవ్యాప్తంగా యువతపై ఆయన ప్రభావం ఉందన్నారు. ‘డిస్కో డ్యాన్సర్’ చిత్రం ద్వారా ఆయన నృత్య శైలులు ఉర్రూతలూగించాయని గుర్తుచేశారు. ‘‘ఐ యామ్ ఏ డిస్కో డ్యాన్సర్...’’ అనే పాటను ఎవరూ మరచిపోలేరన్నారు. హిందీ చిత్రసీమలో అమితాబ్ బచ్చన్ తరవాత అంత క్రేజ్ దక్కించుకున్న కథానాయకుడు మిథున్ చక్రవర్తి అని అన్నారు. ‘‘నేను నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిగా కీలక పాత్ర పోషించారు. విద్యార్థి దశలో వామపక్ష భావజాలం కలిగిన ఆయన తరవాతి కాలంలో టీఎంసీ, అటు పిమ్మట బీజేపీలో చేరారు. దశాబ్ద కాలంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న మిథున్ చక్రవర్తికి భగవంతుడు సంపూర్ణ సంతోషాన్ని, ఆయురారోగ్యాలను ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ అని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.