ఎన్నికల తరువాత మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తాళం వేసి పార్టీని బీజేపీలో కలిపేస్తారని వైయస్ఆర్సీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కేశినేని నాని, దేవినేని అవినాష్తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కాకపోయినా ప్రజలకు అభివృద్ధి, సంక్షేమం అవినాష్ చేశారన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా అవినాష్ పని చేస్తున్నారు. పదేళ్లపాటు అసమర్ధ టీడీపీ ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ ఉన్నారు. బీజేపీ నుండి ఏమీ హామీ పొందారో చంద్రబాబు ప్రజలకు చెప్పాలని కేశినేని నాని డిమాండు చేశారు. ప్రజలందరూ విజ్ఞతగా ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.