ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముంబైని కాదని హైదరాబాద్‌‌లో ఏర్పాటు.. 25వ వసంతంలోకి 'ఐఆర్‌డీఏఐ'.. కీలక సంస్కరణలివే

business |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 10:12 PM

దేశ ప్రజలందరికీ ఇన్సూరెన్స్ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన స్వతంత్ర సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ). ఈ సంస్థ ఏర్పాటై గత శుక్రవారానికి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఆర్థిక సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న ముంబై మహా నగరాన్ని కాదని హైదరాబాద్ కేంద్రంగా ఈ సంస్థ ఏర్పాటైంది. 25 ఏళ్లుగా హైదరాబాద్ కేంద్రంగా సేవలందిస్తోంది. అప్పటి ప్రధాన మంత్రి వాజ్‌పేయి అంగీకరించడంతో ఆర్థిక సేవల నియంత్రణ సంస్థ ఒకటి తెలుగు రాష్ట్రాల్లో కొలువుదీరినట్లయింది. 25 ఏళ్ల ప్రస్థానంలో ఐఆర్‌డీఏఐ తీసుకొన్ని కొన్ని సంస్కరణలు, కీలక నిర్ణయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


బీమా రంగాన్ని సరళీకృతం చేయాలనే ఆలోచనతో ఈ సంస్థ ఏర్పాటుకు విధి విధానాలపై 1993లో రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఆర్ఎన్ మల్హోత్రా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 1994లో కమిటీ నివేదిక సమర్పించింది. ఆ తర్వాత ఆరేళ్లకు 2000, ఏప్రిల్ 19వ తేదీన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటైంది. ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఆర్థిక భద్రత కల్పించడం, పాలసీదారులకు మెరుగైన సేవలు అందించడం ముఖ్యంగా బీమా రంగంలో పోటీని ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ చేరవేయాలనే ప్రధాన లక్ష్యంగా ఐఆర్‌డీఏఐ పని చేస్తోంది.


ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లోని సెక్షన్ 114ఏ కింద నిబంధనలు రూపొందించే అధికారాలను ఈ సంస్థ పొందింది. ఇన్సూరెన్స్ సంస్థల నమోదు నుంచి పాలసీల అనుమతులు, సలహాదారులు, పరిహారం విషయంలో పాలసీదారులకు రక్షణ వంటి కీలక నిర్ణయాలను ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చింది. బీమా చట్టంలోని కొన్ని నిబంధనలను మార్చింది. మరికొన్నింటిని రద్దు చేసింది. కొన్నింటికి ప్రత్యామ్నాయాలు రూపొందించింది. ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులను బట్టి వినూత్న, విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.


గత 25 ఏళ్లలో బీమా రంగంలో కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానంగా 2000 సంవత్సరంలో విదేశీ బీమా కంపెనీలు దేశంలో అడుగుపెట్టేందుకు వీలు కల్పించింది. 26 శాతం వాటాతో అనేక విదేశీ బీమా సంస్థలు దేశంలోకి ప్రవేశించాయి. ప్రభుత్వ సంస్థలతో పాటు కొత్త ప్రైవేట్ బీమా సంస్థలూ ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం మన దేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలు 26 ఉండగా.. సాధారణ బీమా సంస్థలు 27, ఆరోగ్య బీమా సంస్థలు 5 ఉన్నాయి. ఇన్సూరెన్స్ సెక్టార్ లో ఉద్యోగుల సంఖ్య 6 రెట్లు పెరిగింది. ఆస్తుల విలువ 7 రెట్లు పెరిగింది. కార్పొరేట్ ఏజెంట్లు, బ్యాంకుల అసూరెన్స్ వంటి కొత్త సలహాదారులు మార్కెట్లోకి వచ్చారు. ఇన్సూరెన్స్ పాలసీలను క్షణాల్లోనే ఆన్‌లైన్ లో తీసుకునే వీలు కూడా ఐఆర్‌డీఏఐ చేపట్టిన చర్యల ఫలితమే.


స్వాతంత్య్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అందరికీ బీమా పాలసీలు ఉండాలనే లక్ష్యంతో ఐఆర్‌డీఏఐ ముందుకు సాగుతోంది. అందుకు అనుగుణంగా కీలక మార్పులు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇన్సూరెన్స్ అందించేందుకు డిజిటలైజేషన్ ప్రోత్సహిస్తోంది. ఐఆర్‌డీఏఐ ప్రస్తుత ఛైర్మన్ దేబాశిష్ పాండా ఈ విషయంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమని బీమా రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇ-కేవైసీ, డిజిటల్ పాలసీలు, డిజిటల్ చెల్లింపులు, ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల్లో మార్పుల వంటివి ఆయన చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com