ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 నుంచి 10వ తరగతి పాఠ్యపుస్తకాలను పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో విద్యా సంస్కరణల్లో భాగంగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠ్య పుస్తకాలు లేకపోయినా, ఈ పీడీఎఫ్ కాపీలను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని సిలబస్ చదవవచ్చు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు వినియోగించే 353 పాఠ్యపుస్తకాల సాఫ్ట్ కాపీలను ప్రభుత్వం ఆన్లైన్లో విడుదల చేసిందని వెల్లడించారు. ఇది చారిత్రాత్మక చర్యగా అభివర్ణించారు.విద్యార్థులు ఈ పాఠ్యపుస్తకాలను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చని, కోర్సు మెటీరియల్లను అధ్యయనం చేయవచ్చని విజయసాయి వివరించారు.