లక్నో : ఉత్తర్ ప్రదేశ్లో హజ్ కమిటీ కార్యాలయానికి వేసిన కాషాయం రంగును తొలగించి, వేరే రంగు వేయించిన కమిటీ ఉన్నతాధికారి ఒకరిని అక్కడి బాధ్యతల నుంచి తప్పించారు. మైనారిటీ వెల్ఫేర్ డైరెక్టరేట్లో జాయింట్ డైరెక్టర్గా పని చేస్తున్న ఆర్పి సింగ్ హజ్ కార్యాలయానికి వేసిన కాషాయం రంగును తొలగించాలని నిర్ణయించి వేరే రంగు వేయించారు. దీనిపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసి, ఉత్తర్ ప్రదేశ్ హజ్ కమిటీ కార్యదర్శిగా ఆయన నిర్వహిస్తున్న అదనపు బాధ్యతలనుంచి తప్పించింది. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా కాషాయాంబరధారి అయిన యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రభుత్వ భవనాలకు కాషాయం రంగు వేస్తున్న విషయం విదితమే. కాగా ముస్లింలకు చెందిన హజ్ కమిటీ కార్యాలయానికి కూడా కాషాయం రంగు వేయడం కొంత వివాదాస్పదమైంది. ముస్లింలు దీనిని వ్యతిరేకించారు. కాని, ఉత్తర్ ప్రదేశ్ మైనారిటీ శాఖ మంత్రి మొహ్సిన్ రజా మాత్రం దీనిని సమర్థించారు.