న్యూఢిల్లీ: ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర 60 రోజులపాటు కొనసాగనుంది. జూన్ 28 నుంచి ఆగస్టు 26 వరకు యాత్ర కొనసాగుతుందని దేవస్థానం బోర్డు ప్రకటించింది. ఈ మేరకు బోర్డు చైర్మన్, రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా నేతృత్వంలోని బోర్డు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని ఈ దేవాలయ పరిసరాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలపైనా చర్చించామని, వీటిపై సమీక్షా పిటిషన్ దాఖలు చేస్తామని అధికారులు వివరించారు. దేవాలయ పరిసరాల్లో అందరూ నిశ్శబ్దం పాటించాలని ట్రైబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నిరసనలు వ్యక్తం కావడంతో.. గుహలో మంత్ర ఉచ్చారణలు, భజనలపై తాము ఎలాంటి నిబంధనలూ విధించడంలేదని ఎన్జీటీ స్పష్టతనిచ్చింది.మంచు లింగం ముందుకు వెళ్లినప్పుడు మాత్రం అందరూ నిశ్శబ్దంగానే ఉండాలని స్పష్టీకరించింది.