ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇండిగోకు సిబ్బంది ఝలక్...లీవ్ లతో అలజడి

national |  Suryaa Desk  | Published : Mon, Jul 04, 2022, 12:20 AM

ఇండిగో ఎయిర్ లైన్స్ కు ఆ సంస్థ సిబ్బంది ఝలక్ ఇచ్చారు. దీంతో అనుకొన్న మేర సర్వీసులను ఇండిగో ఎయిర్ లైన్స్ తిప్పలేకపోయింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది భారీ సంఖ్యలో సిక్ లీవ్ పెట్టారు. దీంతో ఆ సంస్థ కార్యకలాపాలపై ప్రభావం పడింది. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో దేశీయంగా ఇండిగో విమానాలు ఆలస్యంగా నడిచాయి. శనివారం ఇండిగోకు చెందిన 45 శాతం విమానాలు మాత్రమే సమయానికి రాకపోకలు సాగించాయని కేంద్ర విమానయాన శాఖ దగ్గరున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.


ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది సిక్ లీవ్ పెట్టడం వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. చాలా మంది ఇండిగో సిబ్బంది ఎయిర్ ఇండియా రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కువ వెళ్లారని పీటీఐ వెల్లడించింది. ‘‘శనివారం ఎయిరిండియా రెండో దశ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరిగింది. ఇండిగోకు చెందిన మెజార్టీ సిబ్బంది సెలవు పెట్టి ఇందులో పాల్గొనడం కోసం వెళ్లారు’’ అని విమానయాన శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారని పీటీఐ పేర్కొంది. పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడిచిన విషయమై ఇండిగో నుంచి డైరెక్టోరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వివరణ కోరింది. ఇదిలావుంటే విమానాల ఆలస్యానికి గల కారణాలపై ఇండిగో ఇంకా ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ట్విట్టర్‌లో ఫిర్యాదు చేసిన ప్రయాణికులను మాత్రం ఆ సంస్థ వేచి ఉండాలని కోరింది.


ఇండిగో సంస్థ దేశీయంగా, అంతర్జాతీయంగా రోజుకు 1600కిపైగా విమానాలు నడుపుతోంది. సిబ్బంది కొరత కారణంగా ఇందులో సగానికిపైగా విమానాలు శనివారం ఆలస్యంగా నడిచాయి. అదే సమయంలో ఎయిరిండియా, స్పైస్ జెట్, విస్టారా, గో ఫస్ట్, ఎయిరేషియా ఇండియా విమానాలు సమయానికే నడవడం గమనార్హం. ఇండిగో సంస్థ కోవిడ్ సమయంలో సిబ్బంది వేతనాల్లో కోత విధించింది. పైలెట్ల వేతనాలను 30 శాతం వరకు తగ్గించింది. దీన్ని నిరసిస్తూ.. కొందరు సిబ్బంది ధర్నా నిర్వహించడానికి యత్నించగా.. కొంత కాలం క్రితం వారిని ఇండిగో సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి ఇండిగో యాజమాన్యం, ఉద్యోగుల మధ్య దూరం పెరుగుతోంది.


ఏప్రిల్ 1న పైలెట్ల జీతాలను 8 శాతం మేర పెంచుతున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. నవంబర్ నుంచి మరో 6.5 శాతం పెంచుతామని ప్రకటించింది. కానీ అసంతృప్తితో ఉన్న కొంత మంది పైలెట్లు ధర్నా చేపట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 8న ఉద్యోగులకు ఈమెయిల్ చేసిన ఇండగో సీఈవో రంజోయ్ దత్తా.. జీతాలు పెంచడం కష్టమని పేర్కొన్నారు. పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ.. లాభాలు, పోటీ వాతావరణాన్ని బట్టి జీతాలను అడ్జస్ట్ చేస్తామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com