అంతర్జాతీయ ముడి చమురు చిచ్చులో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా ముడి చమురును భారత్ కొనుగోలు చేస్తే ఉక్రెయిన్పై దురాక్రమణకు మద్ధతు ఇస్తున్నట్టేనని అమెరికా హెచ్చరించింది. మరోవైపు దేశంలో పెట్రోలు ధరల పెరుగుదలను నియంత్రించాలంటే గత్యంతరంలేని పరస్థితి ఈ నేపథ్యంలో భారత్ అమెరికా హెచ్చరికలను పక్కన పెట్టింది. చమురు కొనుగోలు విషయంలో ముందడుగు వేసింది.ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద చమురు సరఫరాదారు రష్యా నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో ఏకంగా క్రూడాయిల్ బ్యారల్ ధర 130 డాలర్లకు చేరుకుంది. దీంతో అమెరికా సహా కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే, స్పెయిన్ వంటి దేశాల్లో చమురు ధరలు 50శాతం పైగా పెరిగాయి. భారత్లోనూ భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరల పెంపునకు మొగ్గుచూపలేదు. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. అమెరికా, ఐరోపా దేశాల ఆంక్షలతో రష్యా చమురు కొనుగోలుపై పలు దేశాలు సందిగ్ధంలో పడ్డాయి.