డిసెంబర్ తర్వాత నుంచి జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్ గడువును మరింత పెంచే ప్రసక్తిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందే రిటర్నులు దాఖలు చేయాలని జీఎస్టీ చెల్లింపుదారులకు సూచించింది. “జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్కు దీర్ఘకాల గడువులు నిర్ణయించాం. కనీసం ఆరు నెలలపాటు పన్ను చెల్లింపుదారులు సొంతంగా మదింపు చేసిన రిటర్నులను ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి ఫైలింగ్ గడువును పెంచబోం” అని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్) సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) తొలి సమావేశం ముగిసిన అనంతరం అధియా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.