కరోనా కష్టకాలంలో సతమతమవుతున్న వేతన జీవులకు ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఉద్యోగులు వేచిచూస్తున్న 2021 ఆర్థిక సంవత్సరం వడ్డీని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) త్వరలోనే జమ చేయనుందని సమాచారం. దీపావళికి ముందే ఉద్యోగుల ఖాతాల్లో ఈపీఎఫ్ఓ వడ్డీ వేస్తుందని వార్తలు వస్తున్నాయి. దీంతో పండుగ సీజన్ లో ఉద్యోగులకు కాస్త ముందుగానే తీపికబురు అందే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే డీఏ, డీఆర్ పొందిన ఉద్యోగులకు ఈ వడ్డీ జమ మరింత చేయూతనివ్వనుంది. ఈపీఎఫ్ఓ కాంట్రిబ్యూషన్ పై వచ్చే వడ్డీలపై పన్ను నిబంధనలను సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) మార్చింది. రూ.2.5లక్షల కాంట్రిబ్యూషన్ కంటే ఎక్కువగా ఉన్న వారికి ఇది వర్తించనుంది. కొత్త నిబంధన ప్రకారం, సంస్థలు రెండు ఈపీఎఫ్ ఖాతాలను కలిగి ఉండాలి. ఒకటి ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ కోసం, మరొకటి నాన్ ట్యాక్సబుల్ కాంట్రిబ్యూషన్ కోసం. 2021-22 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే దీని ప్రభావం ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది.