ఏకంగా 30 మంది యువతులను తన వలలో వేసుకున్నాడు. వారు నుంచి కోట్లలో దోచేశాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు నగర శివారులోని మరకంబట్టు ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి వాహనాని చెక్ చేయగా అందులో నాలుగు కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించారు. అప్పటికే అతడిపై చీటింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు.
చిత్తూరు సమీపంలోని ఎన్.ఆర్ పేటకు చెందిన యువతికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం కొటికలపూడికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి మ్యాట్రిమోనీ సైట్లో పరిచయమయ్యాడు. వెబ్ సైట్లో ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెతో మాట్లాడాడు. మ్యాట్రిమోనీ సైట్ లో మీ ప్రొఫైల్ చూశానని ఆమెను ముగ్గులోకి దించాడు. అంతేకాదు బట్టతలకు విగ్గుపెట్టి అందగాడిలా కటింగ్ ఇచ్చాడు. తాను సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని.. ఏడాదికి 20 లక్షలకు పైగా జీతమొస్తున్నట్లు ప్రొఫైల్ లో ఉండటం ఆ యువతి నమ్మింది. తరచూ ఫోన్లో మాట్లాడుతూ ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఉన్నట్లుండి ఆమెకు ఓ రోజు ఫోన్ చేసి తన తల్లికి ఆరోగ్యం బాగోలేదని ఏడుస్తూ మాట్లాడుతూ రూ.1.40 లక్షలు మరో యువతి ఖాతాలో వేయించాడు. ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చేసరికి ముఖం చాటేశాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శ్రీనివాస్ చిత్తూరుకు చెందిన బాధిత యువతితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన 30 మంది యువతులను మోసం చేశాడు. కొందరి వద్ద ఉద్యోగాలిప్పిస్తానని కూడా డబ్బులు వసూలు చేశాడు. ఇలా దాదాపు రూ.3 కోట్ల వరకు యువతులను చీట్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
ఒంగోలుకు చెందిన ఐటి ఉద్యోగిని వద్ద నుంచి రూ.27 లక్షలు, నరసారావు పేట ఉద్యోగిని నుంచి రూ.40 లక్షలు, మదనపల్లెకు చెందిన యువ వైద్యురాలి వద్ద నుంచి రూ.7 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. ఇలా వచ్చిన డబ్బుతో తాను జల్సాలు చేసుకునేవాడు. అలాగే ఒక్కో అమ్మాయికి ఒక్కో మొబైల్ నెంబర్ వాడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈజీ మనీ కోసం గంజాయి కూడా స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. అరెస్ట్ అనంతరం శ్రీనివాస్ ను రిమాండ్ కు తరలించారు. మ్యాట్రిమోనీ సైట్లలో సంబంధాలు చూసే ముందు యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.