ఎలుక కరవడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సురేష్ సాల్వే అనే రైల్వే ఉద్యోగి దోంబీవాలీలోని తక్కుర్లీలో ఉన్న రైల్వే కాలనీలో ఉంటున్నాడు. ఆ కాలనీ పరిశుభ్రంగా ఉండకపోవడంతో అక్కడ ఎలుకల బెడద ఎక్కువయ్యింది. బుధవారం రాత్రి సాల్వే నిద్రపోతుండగా అతని కన్నును ఓ ఎలుక గట్టిగా కొరికేసింది. అతనికి మెలకువ వచ్చేసరికే కంటికి కంటి నుంచి రక్తం కారుతుంది. అద్దంలో చూసుకుంటే కంటికి గాయం అయినట్లు కనిపించింది. గట్టిగా అరుస్తూ ఆయన స్పృహ తప్పాడు. అతని కొడుకు అతన్ని వెంటనే కళ్యాణ్లోని రైల్వే ఆస్పత్రికి తరలించాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ సాల్వే చనిపోయాడు. అయితే అతను ఎలుక కొరకడం వల్ల చనిపోలేదని, కాలేయం పాడవ్వడం వల్ల చనిపోయాడని వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్టును మృతుడి బంధువులు నేలకేసి కొట్టారు. ఎలుక వల్లే చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతను బాగా మద్యం తాగేవాడని, అందువల్లే లివర్ పాడైపోయిందని డాక్టర్లు చెప్పారు. కానీ మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఇప్పుడీ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. రైల్వే కాలనీలోని చాలా మంది తమ కాలనీలో పరిశుభ్రత లేదంటూ ఆందోళనలు చేస్తున్నారు.