బ్రిటన్లో వారం రోజుల వ్యవధిలో 35 వేల 204 కరోనా వైరస్ డెల్టా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రకమైన వైరస్ సోకిన వారి సంఖ్య 1,11,157 కు చేరింది. వారం రోజుల వ్యవధిలో డెల్టా కేసుల నమోదులో 46 శాతం పెరుగుదల చోటుచేసుకుందని బ్రిటన్ వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ డెల్టా వేరియంట్ను భారతదేశంలో తొలుత గుర్తించారు. ఈ సందర్భంగా యూకే హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ జెన్నీ హ్యారిస్ మాట్లాడుతూ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగిందని, ఫలితంగా కరోనా కేసుల సంఖ్య, ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య చాలావరకూ తగ్గిందన్నారు.
కరోనా విషయంలో తాము ఏమాత్రం నిర్లక్ష్యం వహించలేదు. రెండు మోతాదుల టీకాను దేశంలోని అత్యధిక ప్రజలకు వేశాం. అయితే వ్యాక్సీన్ కరోనా నుంచి పూర్తిస్థాయి రక్షణను ఇవ్వదు. అందుకే ప్రజలంతా కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరమన్నారు. కాగా యూకేలో ఆరు లాంబ్డా కేసులు నమోదయ్యాయి. అవన్నీ విదేశీ ప్రయాణికులకు సంబంధించినవి. లాంబ్డా వేరియంట్ను తొలుత పెరూలో గుర్తించారు. తరువాత దీనికి సంబంధించిన కేసులు 26 దేశాలలో నమోదయ్యాయి.