మామూలుగా అయితే నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయాలని అబ్బాయిలు హోర్డింగ్లు, టవర్లు ఎక్కడం చూసి ఉంటాం. కానీ మధ్యప్రదేశ్లో మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధమైన సంఘటన చోటుచేసుకుంది. అబ్బాయి కోసం ఓ బాలిక హోర్డింగ్ ఎక్కి హల్చల్ చేసింది. అది కూడా మైనర్ బాలిక కావడం విశేషం. పోలీసుల కథనం మేరకు..మధ్యప్రదేశ్లోని పర్దేశిపుర భండారీ బ్రిడ్జ్ ప్రాంతంలో ఓ బాలిక ఆదివారం సాయంత్రం హోర్డింగ్ ఎక్కింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లికి తన తల్లి అభ్యంతరం చెబుతుందనే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది. బాలిక హోర్డింగ్ ఎక్కడంతో ఆ ప్రాంతంలో భారీగా జనం చేరారు. ఆ యువతి మాత్రం తన కోరిక తీర్చితేనే కిందికి దిగుతానని పట్టుబట్టింది. దర్జాగా హోర్డింగ్పై కూర్చొని ఫోన్ వాడుతూ కనిపించింది. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలికను కిందికి దించేందుకు చర్చలు జరిపారు. అయితే బాలిక మాత్రం తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లి చేస్తేనే కిందికి దిగివస్తానని చెప్పింది. దీంతో పోలీసులు ఆ బాలుడికి సమాచారం అందజేశారు. ఆ బాలుడు అక్కడికి వచ్చి కిందికి దిగాలని పట్టుబట్టడంతో హోర్డింగ్ పై నుంచి బాలిక కిందకు దిగిందని పర్దేశిపుర పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ అశోక్ పాటిదార్ తెలిపారు.