పేటీఎం తాజాగా ఎలాంటి గ్యారంటీ లేకుండానే రుణాలు అందిస్తామని ప్రకటించింది. అయితే ఈ బెనిఫిట్ అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) మాత్రమే వర్తిస్తుంది. ఎంఎస్ఎంఈలకు గ్యారంటీ లేని రుణాలు అందిస్తామని పేటీఎం ప్రకటించింది. తక్కువ వడ్డీ రేటుకే రూ.5 లక్షల వరకు రుణాన్ని పొందొచ్చని, చిరు వ్యాపారుల కోసం డైలీ ఈఎంఐ ప్రొడక్టులను కూడా తీసుకువచ్చామని పేర్కొంది. 2021 మార్చి నెల చివరి నాటికి రూ.1,000 కోట్ల రుణాల మంజూరు లక్ష్యంగా పని చేస్తామని పేటీఎం తెలిపింది. పీ2ఎం విభాగంలో పేటీఎంలో ఇప్పటికే 50 శాతానికి పైగా మార్కెట్ వాటాతో దూసుకెళ్తోంది. కస్టమర్ల కోసం పలు రకాల డిజిటల్ పేమెంట్స్ అందిస్తోంది. మర్చంట్ లెండింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా తనఖా లేకుండానే.. పేటీఎం ఫర్ బిజినెస్ యాప్ ద్వారా ఈ లోన్ పొందొచ్చు. పేటీఎం ఆల్ ఇన్ వన్ ఆండ్రాయిడ్ పీఓఎస్ మెషీన్ ద్వారా ఎంఎస్ఎంఈలకు అన్ని రకాల పేమెంట్ సర్వీసులు అందిస్తోంది. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు పేటీఎం వాలెట్, యూపీఐ ఆధారిత యాప్స్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు వంటి లావాదేవీలు నిర్వహించొచ్చు.