అమరావతిలో భూములు కొనకూడదని చట్టం ఉందా? అని టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ ఏపీ రాజధాని అమరావతి అవుతుందని పేపర్లలో వచ్చిందన్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏంటో కేబినెట్ సబ్కమిటీకి తెలియదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుందని, ఈ 16 నెలల్లో రాష్ట్రంలో అంతులేని దోపిడీ, అవినీతి జరిగిందని బోండా ఉమా ఆరోపించారు.
నిజాయితీగా పనిచేసిన టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ప్రభుత్వం కేసులో ఇరికించిందని బోండా ఉమా విమర్శించారు. అవినీతిపరుడైన మంత్రి బెంజ్ కారులో తిరుగుతున్నారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మీడియా సాక్షిగా ఫిర్యాదు ఇస్తే ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. నెలకు రూ.3 లక్షలు జీతం తీసుకుంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వానికి ఏమైనా పనికి వచ్చే ఒక్క సలహా అయినా ఇచ్చారా? అని నిలదీశారు. విశాఖలో వన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని, దీనిపై దమ్ముంటే సీబీఐ విచారణ జరపించాలని బోండా ఉమా ప్రభుత్వానికి సవాల్ చేశారు.