కేంద్ర ప్రభుత్వం వాహన దారులకు తీపి కబురు చెప్పేందుకు సన్నద్దమవుతుంది. వాహనదారుల కోసం కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు రెడీ అవుతుంది. ఎన్నాళ్ల నుంచో వేచి చూస్తున్న స్క్రాప్ పాలసీని అమలులోకి తీసుకువచ్చేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు కేంద్రప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టం చేసింది. వెహికల్ స్క్రాపింగ్ పాలసీకి సంబంధించిన కేబినెట్ నోట్ రెడీ అయ్యిందని రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సభలో ప్రకటించారు. కండీషన్లో లేనటువంటి, పాత వెహికల్స్ను తొలగించడానికి ఈ స్క్రాప్ పాలసీ ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కొత్త పాలసీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలుగనున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా వాహన పరిశ్రమ జోరందుకుంటుందని, మళ్లీ కొత్త వెహికల్స్ కొనుగోలు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్క్రాప్ పాలసీ కారణంగా కస్టమర్లు కొత్త వాహనాలను ఏకంగా 30 శాతం తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు. పాత వెహికల్స్ రోడ్డుపై తిరగకపోవడంతో కాలుష్యం కూడా 25 శాతం తగ్గుతుందని అంచనా వేశారు. ఇంకా స్క్రాప్ సెంటర్లలో భారీ స్థాయిలో ఉపాధి కూడా లభిస్తుందని తెలిపారు. స్క్రాప్ సెంటర్కు పాత వాహనాలను విక్రయిస్తే కొత్త కారు రిజిస్ట్రేషన్ ఫ్రీ అని తెలిపారు. కొత్తగా కారు కొంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించక్కర్లేదని వెల్లడించారు.