కరోనా దెబ్బతో ప్రకాశం జిల్లా రైతాంగం కుదేలైంది. ఖరీఫ్ సీజన్ పై ఎంతో ఆశ పెట్టుకున్న రైతులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఒకపక్క పంటలు వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా కరోనా వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉంది. గతంలో కూడా కరోనాకు ముందు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అప్పట్లో కురిసిన అకాల వర్షం వల్ల టమాటా, అరటి, పచ్చిమిర్చి,మామిడి తోటలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాలలో బాగానే పండినా లాక్ డౌన్ కారణంగా రవాణా లేకపోవడం వల్ల గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఒక దశలో అరటి గెల 100 రూపాయలు, టమాట కేజీ 5 రూపాయలకే అమ్మిన సందర్భాలు చోటుచేసుకున్నాయి కానీ, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మళ్లీ పంటలు వేసుకునే సీజన్ రానే వచ్చింది. వర్షాలు బాగా పడ్డాయి. దీంతో రైతులు అప్పు చేసి మరి పంటలు వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ వారి ఆశలపై కరోనా మరోమారు నీళ్లు చల్లే విధంగా ఉంది. ఒకపక్క లాక్ డౌన్ కారణంగా పంటలకు కావలసిన మందులు, ఎరువులు తెచ్చుకోవడంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి వ్యాపారస్తుడు తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం రైతులు అప్పు చేయాలన్నా ఎవరు కూడా ఇచ్చే పరిస్థితులు లేవు.పోనీ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం మరి ఎంతమందికి అందిందో లేదో, ఒకవేళ సహాయం అందినా పూర్తి స్థాయిలో ఆ సహాయం సరిపోతుందో లేదో. వర్షాలు పడి వనరులు పుష్కలంగా ఉన్నా ఈసారైనా రైతు బతుకులు మారుతాయో లేదో వేచి చూడవలసిందే.