ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో పెరిగిన భూగర్భజలాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2017, 12:54 AM

అమరావతి నుంచి సూర్య ప్రతినిధి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తం మీద సాధారణ వర్షపాతం సంతృప్తికరంగా ఉండటంతో భూగర్భజలాలు పెరిగాయి. రాష్ట్రం మొత్తం మీద 1.46 మీటర్ల మేర పెరిగినట్టు తాజా లెక్కలు తెలియజేస్తున్నాయి. భూగర్భజలవనరులశాఖ ప్రతి రోజూ ఈ గణాంకాలు సేకరిస్తోంది. సాధారణంగా రాయలసీమలో భూగర్భజలాలు పెరుగుదల తక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ సారి అక్కడ మెరుగుపడటం విశేషం. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో 1.71 మీటర్ల మేర పెరిగాయి. కోస్తాంధ్రలో 1.34 మీటర్ల మేర ఎదుగుదల కనిపిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా కూడా భూగర్భ జలాలు పెరగడం మరో విశేషం. ఈ నీటిని పోలవరం కుడి కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీరు అందిస్తున్నారు. ప్రవాహాల్లో లోటు లేకుండా ఉండడం కోసం నిజానికి ఈ కాలువ పూర్తి స్థాయిలో సిమెంట్‌ లైనింగ్‌ చేయాల్సి ఉంది. అయితే ప్రకాశం బ్యారేజీకి నీరు చేర్చే క్రమంలో ఇంకా లైనింగ్‌ పనులు చేయలేదు. ఆ కారణంగా నీరు ఇంకి భూగర్భజలాలు పెరిగాయి. 174 కి.మీ పొడవు ఉన్న ఈ కాలువ పరిధిలో భూగర్భ జలవనరుల శాఖ 13 ఫిజోమీటర్లు ఏర్పాటు చేసి లెక్కలు తీసింది. పశ్చిమగోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలో జలాలు పూర్తిగా అడుగంటి ఉంటాయి. అలాంటిది కుడి కాలువ కారణంగా అక్కడ కూడా పరిస్థితి మెరుగయింది. రెండు రోజుల కిందట తీసిన గణాంకాల ప్రకారం అన్ని చోట్లా భూగర్భజలం వఎద్ధి చెందినట్లు తేలింది. కుడి కాలువ ద్వారా తొలుత 1500 క్యూసెక్కులు ఇచ్చి క్రమేణా 5000 క్యూసెక్కులకు పెంచారు. యర్నగూడెంలో మాత్రం కేవలం 0.06 మీటర్లు, చల్లచింతలపూడిలో ఏకంగా 3.02 మీటర్ల మేర, కృష్ణా జిల్లాలో 1.17 మీటర్ల నుంచి 2.95 మీటర్ల వరకు భూగర్భజలాలు పెరిగినట్టు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో భూగర్భజలాలు 3 మీటర్ల నుంచి 8 మీటర్ల మధ్యే ఉండేలా నీటిని ఇంకించాలని ప్రభుత్వం ఆశిస్తోంది. రుతుపవన కాలం తర్వాత 3 మీటర్లకు చేరాలనేది లక్ష్యం. ప్రస్తుతం రాష్ట్రంలోని 5 జిల్లాల్లో మాత్రమే సగటున భూగర్భజలాలు 8 మీటర్ల లోపుగా ఉండటం విశేషం. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, నెల్లూరు జిల్లాల్లో తాజా గణాంకాల ప్రకారం సగటున 8 మీటర్ల లోపుగానే భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com