ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. సర్జరీ మధ్యలో ఆపేసి బయటకొచ్చిన డాక్టర్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 09:12 PM

సర్జరీ చేస్తోన్న వైద్యుడు తనకు ఆకలి వేస్తోందని మధ్యలోనే ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి బయటకు వచ్చేశాడు. దాదాపు రెండు గంటల తర్వాత వచ్చి శస్త్రచికిత్స పూర్తి చేశాడు. ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్‌లో గతేడాది డిసెంబరులో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ జిల్లాలోని నవాబాద్‌ ప్రాంతానికి చెందిన కాజల్‌ శర్మ అనే బాలిక గత డిసెంబరులో ఇంట్లో ఆడుకుంటూ ఆకస్మాత్తుగా కింద పడిపోయింది. దీంతో ఆమె ఎడమ చేయికి గాయం కాగా.. మోచేతి ఎముక విరిగిపోయింది. తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.


అక్కడ చిన్నారిని పరీక్షించిన ఆర్థోపెడిక్‌ సర్జన్‌.. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని సూచించాడు. అందుకు కుటుంబసభ్యులు అంగీకరించడంతో డిసెంబర్‌ 22న శస్త్రచికిత్స చేసేందుకు ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. అయితే, సర్జరీ ప్రారంభించిన కొద్ది సేపటికే తనకు ఆకలిగా ఉందని, మసాలా దోశ తిని వస్తానని చెప్పి వైద్యుడు మధ్యలోనే బయటకు వచ్చేశాడు. దాదాపు 2 గంటల తర్వాత తిరిగి వచ్చి సర్జరీ పూర్తిచేశాడు. అయినప్పటికీ, గాయం నయం కాలేదని, వేళ్లు కూడా వంకరగా మారాయని బాలిక కుటుంబసభ్యులు మళ్లీ ఆసుపత్రికి వచ్చారు. అయితే వారిని కలిసేందుకు ఆయన వైద్యుడు నిరాకరించాడు.


దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో ఆసుపత్రిలో ఆ బాలికకు చికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. బాలిక మాట్లాడుతూ.. ‘సర్జరీ సమయంలో తాను అన్నింటిని చూశాను.. నాకు మెలకువ ఉంది.. చేయి మాత్రమే మొద్దుబారిపోయింది. ఆపరేషన్ ఎలా చేస్తున్నారో నేను చూడగలిగాను.. మధ్యలో నాకు ఆకలిగా ఉందని మసాలా దోశ తిని వస్తానని చెప్పి డాక్టర్ బయటకు వెళ్లిపోయారు... దాదాపు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చి హడావిడిగా ఆపరేషన్ పూర్తి చేశాడు. సర్జరీ తర్వాత గ్యారంటీగా చేయి నయం అవుతుందని చెప్పారు.. కానీ, నయం కాలేదుకదా చేతి వేళ్లు కూడా వంకరగా మారాయి.. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే కలిసేందుకు నిరాకరించారు. ఇంకా వేరే ఆస్పత్రిలో వెళ్లి ఆపరేషన్ చేయించుకున్నా' అని కాజల్ శర్మ తెలిపింది.


ఈ విషయమై నవాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ తర్వాత ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదని చెప్పారు. త్వరలోనే నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని వారు వెల్లడించారు. కాగా, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. మహారాష్ట్రలో ఓ వైద్యుడు.. టీ ఇవ్వలేదని మధ్యలోనే సర్జరీ వదిలేసి వెళ్లిపోయాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com