ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీని కాదని హైదరాబాద్‌కు.. ఆ స్థలాల అద్దె లావాదేవీలు పెరిగాయ్!

business |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 10:42 PM

కార్పొరేట్ సంస్థల నుంచి గిరాకీ స్థిరంగా ఉండటంతో ఈ ఏడాది జనవరి- మార్చి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఆఫీసు స్థలాల అద్దె ట్రన్సాక్షన్లు 13 శాతం మేర పెరిగాయి. 2024 తొలి త్రైమాసికంలో ఏకంగా 1.34 కోట్ల చదరపు అడుగులకు ఆఫీసు స్థలాల లీజింగు చేరిందని స్థిరాస్తి సేవలు అందించే వెస్టియన్ సంస్థ తెలిపింది. క్రితం ఏడాది 2023 తొలి మూడు నెలల్లో 1.18 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్థలాల లీజింగ్ నమోదైంది. దాంతో పోలిస్తే ఈసారి 13 శాతం పెరిగింది.


దేశవ్యాప్తంగా చూసుకుంటే ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు లీజింగ్ ధోరణులపై వెస్టియన్ సంస్థ శనివారం ఓ నివేదిక విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో ఆఫీసు స్థలాల లీజింగ్ ట్రాన్సాక్షన్లు 25 శాతం మేర పడిపోయి 18.1 లక్షల చదరపు అడుగులగా నమోదైంది. అయితే, గత ఏడాది 2023లో ఇదే సమయంలో ఢిల్లీ 24 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాల స్థలం అద్దెకు వెళ్లింది. మరోవైపు.. 2023, అక్టోబర్- డిసెంబర్ త్రైమాసికంలోనూ ఢిల్లీలో ఆఫీసు స్థలాలకు గిరాకీ తగ్గడం గమనార్హం.


ఆఫీసు స్థలాల అద్దె ట్రాన్సాక్షన్లలో దేశవ్యాప్తంగా చూసుకుంటే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల వాటా 61 శాతానికి పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇది గతంలో 54 శాతం వరకూ ఉంది. బెంగళూరులో ఆఫీసు లీజింగ్ గత ఏడాది 2023 జనవరి- మార్చి త్రైమాసికంలో 33 లక్షల చదరపు అడుగులుగా ఉండగా.. ఈసారి 26.2 లక్షల చదరపు అడుగులకు పరిమితమైంది. అలాగే చెన్నైలో 16 లక్షల నుంచి 33.5 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే గత ఏడాది 2023 తొలి త్రైమాసికంలో 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆఫీసు స్థలాలు అద్దెకు వెళ్లాయి. ఈ ఏడాది 2024 జనవరి- మార్చి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులకు పెరిగింది. దాదాపు 46 శాతం మేర పెరిగింది. దేశ రాజధాని హస్తినాను కాదని కంపెనీలు దక్షిణ భారతానికి క్యూ కడుతున్నాయి. అందులో ప్రధానంగా హైదరాబాద్, చెన్నైలో తమ ఆఫీసులు తెరిచేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నట్లు ఈ నివేదికతో తెలుస్తోంది.


ఇక ముంబైలో ఈ ఏడాది 24.9 లక్షల చదరపు అడుగులు, కోల్‌కతాలో 1.6 లక్షలు, పుణెలో 7.1 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం అద్దెకు వెళ్లింది. ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్ సంస్థలు 47 శాతం ఆఫీసు స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆర్థిక సేవల రంగంలోని కంపెనీలు 11 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లెక్సిబుల్ స్పేస్ సంస్థలు మిగితా స్థలాన్ని అద్దెకు తీసుకున్నాయి. ఆఫీసు స్థలాల అద్దె విషయానికి వస్తే 2024 సానుకూలంగా ప్రారంభమైనట్లు వెస్టియన్ సీఈఓ తెలిపారు. ఆఫీసు స్థలాలకు గిరాకీ తిరిగి వచ్చిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com