ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 28, 2024, 09:00 PM

తిరుమలలో మే నెలలో విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది. ⁠మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.. ⁠మే 4న‌ సర్వ ఏకాదశి. ⁠మే 10న అక్షయతృతీయ.. ⁠మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి నిర్వహిస్తారు. ⁠మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు.. మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి ఉంటుంది. మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి నిర్వహిస్తారు.


మే 16 నుంచి 24వ తేదీ వరకు శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు


తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.


మే నెల 16న ఉదయం – ధ్వజారోహణం.. రాత్రి – పెద్దశేష వాహనం. మే 17న ఉదయం – చిన్నశేష వాహనం.. రాత్రి – హంస వాహన సేవ నిర్వహిస్తారు. మే 18న ఉదయం – సింహ వాహనం.. రాత్రి – ముత్యపుపందిరి వాహనం. మే 19న ఉదయం – కల్పవృక్ష వాహనం.. రాత్రి – సర్వభూపాల వాహనం. మే 20న ఉదయం – మోహినీ అవతారం.. రాత్రి – గరుడ వాహనం. మే 21న ఉదయం – హనుమంత వాహనం.. రాత్రి – గజ వాహనం. మే 22న ఉదయం – సూర్యప్రభ వాహనం.. రాత్రి – చంద్రప్రభ వాహనం. మే 23న ఉదయం – రథోత్సవం.. రాత్రి – అశ్వవాహనం. మే 24న ఉదయం – చక్రస్నానం.. రాత్రి – ధ్వజావరోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


తిరుపతి బ‌ర్డ్, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల‌ను ప‌రిశీలించిన– రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్ నజీర్


టీటీడీ ఆధ్వర్యంలో నిర్వ‌హిస్తున్న‌ బ‌ర్డ్‌, శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రుల‌ను రాష్ట్ర గవర్నర్‌ ఎస్.అబ్దుల్ నజీర్ దంప‌తులు సందర్శించారు. ముందుగా బర్డ్ ఆసుపత్రిని సందర్శించి, నిరుపేదలకు ఉచితంగా మోకాలి కీళ్ల మార్పిడి మరియు ఇతర ఎముకల సంబంధిత వ్యాధులకు అందుతున్న చికిత్స, ఐసియు, ఔట్‌పేషెంట్‌ విభాగం, ఆపరేషన్‌ థియేటర్లు, వార్డులను, డిజిట‌ల్ ఎక్స్‌రే, సిటి స్కాన్, కృత్రిమ అవ‌య‌వాల త‌యారీ, అమ‌రిక కేంద్రాన్ని పరిశీలించారు.


అనంత‌రం శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ ఆసుపత్రి వార్డుల్లో గుండె జబ్బులతో చికిత్స పొందుతున్న చిన్నారులను, క్యాథ్‌ల్యాబ్, ఐసీయూ తదితర వార్డులను రాష్ట్ర గవర్నర్‌ సందర్శించి, రోగుల తల్లిదండ్రులతో మాట్లాడారు. నిరుపేదలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేసి చిన్నారులకు టీటీడీ అందిస్తున్న సేవల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర గవర్నర్ టీటీడీ అందిస్తున్న‌ సౌక‌ర్యాల‌ను రోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. రోగులు సంతృప్తి వ్య‌క్తం చేశారు. అనంతరం రాష్ట్ర గవర్నర్‌ దంప‌తుల‌ను టీటీడీ జేఈవోలు గౌత‌మి, వీర‌బ్ర‌హ్మం సాలువ‌తో స‌న్మానించారు. ఈ కార్యక్రమంలో బ‌ర్డ్ ఆసుప‌త్రి ప్ర‌త్యేకాధికారి రెడ్డప్ప రెడ్డి, పద్మావతి చిన్న పిల్లల ఆసుపత్రి డైరెక్టర్ డా. శ్రీనాథ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com