ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజధాని రైతులకు కృషి సేవలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 07, 2017, 12:46 AM

 -వ్యవసాయ, అనుబంధ విభాగాలకు ప్రోత్సాహం 


 -శిక్షణతో సేద్యంలో మరింత అవగాహన


 -దత్తత గ్రామాల్లో కృషి విజ్ఞాన కేంద్రం  


అమరావతి నంచి సూర్య ప్రత్యేక ప్రతినిధి : నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి సమీపాన లాంలో ఏర్పాటు చేసిన కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) రైతులకు చేరువయ్యేందుకు ప్రణాళికతో ముందుకెళుతుంది. వ్యవసాయ, అనుబంధ విభాగాలకు ప్రోత్సహిస్తూ రైతుల ఆదాయ వనరులను పెంపొందించేలా శిక్షణ ఇవ్వనుంది. అమరావతిని విశ్వనగర స్థాయిలో నిర్మిస్తుండటంతో స్థానిక ప్రజలతో పాటు ఇక్కడ పరిశ్రమలు, ఐటీ, విద్యా సంస్థలు తమ శాఖలను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ అనుబంధ శాఖల ద్వారా కార్యక్రమాలను నిర్వహించి రైతులకు స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించనున్నారు.


రాజధాని ప్రాంతంలో కృషి విజ్ఞాన కేంద్రం... 


భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రాలు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 13, డాక్టర్‌ వై.ఎస్‌.ఆర్‌. ఉద్యాన విశ్వవిద్యాలయానికి 2, శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి ఒక కృషి విజ్ఞాన కేంద్రాన్ని కేటాయించింది. పశువెద్య విశ్వవిద్యాలయం లాం ఫాంలో కృషి విజ్ఞాన కేంద్రాన్ని 2012లో ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో కార్యక్రమాలను చేయలేకపోయారు. జిల్లాలోని చెరుకుపల్లి వినయాశ్రమంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు దీర్ఘకాలికంగా సేవలు అందజేసినా ప్రస్తుతం పని చేయని పరిస్థితి. దీంతో లాంలోని కృషి విజ్ఞాన కేంద్రమైనా రైతులకు సేవలు అందజేస్తారని భావించినా ఆలస్యమైంది. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయటంతో ఇక్కడి రైతులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేవీకే కార్యక్రమాలను నిర్వహించాలని పశువైద్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది.


మౌలిక సదుపాయాలకు రూ.6.13 కోట్లు...


దీనికోసం మౌలిక సదుపాయాల కోసం రూ.6.13 కోట్లను విడుదల చేసింది. పరిపాలన భవనంతో పాటు వ్యవసాయ అనుబంధ పశుసంవర్థక, మత్స్య శాఖల ద్వారా పశువుల ఉత్పత్తులను పెంచటం, వ్యవసాయంలో అపరాల సాగును ప్రోత్సహించటం తదితర పనులు చేపట్టారు. పరిపాలన భవనంతో పాటు కోళ్లు, గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, పందుల పెంపకానికి ప్రత్యేకంగా షెడ్లను నిర్మించారు. అత్యాధునిక స్థాయిలో పశువులకు మేతను వేయడం, తాగునీటి కోసం తొట్టెలు నిర్మించారు. రైతులకు వ్యవసాయంలో పంటల సేద్యంతో పాటు పాడి, గృహ విజ్ఞానాన్ని ఒకే గొడుగు కింద సేవలు అందించాలనేది కృషి విజ్ఞాన కేంద్రం లక్ష్యం. కేవీకేను సందర్శించినవారు అన్ని అంశాల గురించి తెలుసుకునేలా అవగాహన కల్పిస్తారు. ఈ కేంద్రం కార్యక్రమాల కోసం 59.85 ఎకరాలను విశ్వవిద్యాలయం కేటాయించింది. ఇక్కడ కంది, పత్తి వంటివి రసాయన ఎరువులు, మందులు వాడకుండా సాగు చేసి చూపుతున్నారు. వీటి విత్తనాలను ఏపీ సీడ్స్‌కి పంపుతారు. ఆసక్తి ఉన్న రైతులు వీటిని ఏపీ సీడ్స్‌ ద్వారా తెచ్చుకోవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com